- మిర్జాగూడ దుర్ఘటన పరిశీలించిన డీజీపీ
చేవెళ్ల, (ఆంధ్రప్రభ) : చేవెళ్ల మండలం మీర్జాగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో, డీజీపీ శివధర్ రెడ్డి స్వయంగా ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రోడ్ సేఫ్టీ సమస్యలను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
డ్రైవింగ్ సమయంలో డిఫెన్సివ్ డ్రైవింగ్ పద్ధతులు పాటించడం అత్యవసరమని సూచించారు. స్పీడ్ లిమిట్ ఉన్న చోట కూడా తప్పుడు ధైర్యం, నిర్లక్ష్యం ప్రాణాలు తీస్తోంది అన్నారు. ఎంత ఎక్స్ పీరియన్స్ ఉన్నప్పటికీ రోడ్లపై జాగ్రత్తలు పాటించడం అవసరమన్నారు.. కాబట్టి రోడ్లపై ప్రతి మలుపు వద్ద జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరించారు.
అరైవల్ పేరుతో కొత్త రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీజీపీ వెల్లడించారు. వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు, సోషల్ క్యాంపెయిన్లు నిర్వహించనున్నట్టు తెలిపారు. స్కూల్లు, కాలేజీలు, కార్పొరేట్ సంస్థలతో సమన్వయం చేస్తూ డ్రైవర్లలో భద్రతా చైతన్యం పెంపొందించే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.
ప్రస్తుతం చేవెళ్ల ప్రమాదంపై స్థానిక ఏసీపీ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోందని, ఘటనకు కారణాలు త్వరలో వెల్లడిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.

