నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన యోధుడు

నిజాం పాల‌న‌కు వ్య‌తిరేకంగా పోరాడిన యోధుడు

దండేపల్లి, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేడియో ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడే మన్ కీ బాత్(Mann Ki Bath)లో ఆదివాసీ నాయకుల స్ఫూర్తిదాయక జీవితాలను స్మరించారు. ఈ రోజు ప్రసారమ‌య్యే 127వ ఎపిసోడ్ లో ప్రధాని మోడీ మాట్లాడుతూ తెలంగాణకు చెందిన గిరిజనోద్యమ నాయకుడు కొమరం భీమ్ గురించి ప్రస్తావిస్తూ, ఆయన త్యాగం, ధైర్యం, నాయకత్వం గురించి విశేషంగా మాట్లాడారు.

కొమురాం భీమ్(Komuram Bheem) జయంతిని అక్టోబర్ 22న దేశవ్యాప్తంగా గౌరవప్రదంగా జరుపుకున్నామ‌ని, ఆయన కేవలం 40 సంవత్సరాలు జీవించినప్పటికీ, ఆయన ప్రభావం అపారమైంద‌న్నారు. గిరిజన సమాజంలో ఆయన ఒక స్ఫూర్తిదాయక దీప్తి అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమరం భీమ్ ధైర్యం భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఒక కీలక అధ్యాయమని గుర్తు చేశారు. కొమరం భీమ్ తన జీవితకాలంలో నిజాం శక్తికి గట్టి సవాలు విసిరి, గిరిజన సమాజంలో స్వాతంత్ర్య స్పూర్తి(Freedom Spirit)ని నింపారని తెలిపారు.

ఆయన వ్యూహాత్మక నైపుణ్యం, ధైర్యసాహసం, ప్రజల హక్కుల కోసం పోరాటం దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ఆయన త్యాగం ప్రతి భారత యువకుడికి ఒక స్ఫూర్తి కావాల‌న్నారు. యువత ఆయన జీవితం, పోరాటం గురించి తెలుసుకొని, ఆయన చూపిన దారిలో నడవాల‌ని మోదీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(Palvai Harish Babu), బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు వేరబెల్లి రఘునాథ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్, మండల బీజేపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.