మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ

మొక్కలతోనే పర్యావరణ పరిరక్షణ
ఉమ్మడి వరంగల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఊరి ఊరికో చెట్టు.. గుడిగుడికో జమ్మి చెట్టు అనే నినాదంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత జోగినపల్లి సంతోష్ కుమార్(Joginapalli Santosh Kumar) ఈ రోజు హనుమకొండ(Hanumakonda) పద్మాక్షి గుట్ట ఆలయ రహదారిలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్(Dasyam Vinay Bhaskar) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
తొలుత పద్మాక్షి గుట్ట మీద అమ్మవారికి పూజ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రెండు జమ్మి మొక్కల(Jammi plants)ను నాటారు. ఈ సందర్భంగా దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని పాడి పంటలతో సస్యశ్యామలం చేసిన ఘనత ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కే దక్కుతుందని అన్నారు. తెలంగాణలో అడవుల శాతం పెంచేందుకు పదేళ్ల తెలంగాణకు హరితహారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి కోట్లాది మొక్కలు నాటారని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ పేరుతో లక్షలాది మొక్కలను నాటారని, ఈ కార్యక్రమ నిర్వాహకులు సంతోష్ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణ(Environmental protection)పై అవగాహన కల్పించారని కొనియాడారు. తెలంగాణలో జమ్మి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, నేడు ఈ పద్మాక్షి ఆలయ ఎదుట జమ్మి మొక్కలను నాటామని అన్నారు.
తెలంగాణలో నేడు బతుకమ్మ సంబరాలు మొదలవుతున్నాయని, ఆడబిడ్డలు జరుపుకొనే ఈ పండగకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేయాలని, సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ(Bathukamma Festival) కానుకలు అందజేసిందని, ఈ ప్రభుత్వం సైతం సకాలంలో ఆడబిడ్డలకు కానుకలు అందించి వారు సంతోషంతో పండుగ జరుపుకొనేలా చూడాలని కోరారు.
కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు గార్లపల్లి సతీష్, బీఆర్ఎస్ నాయకులు కోడెం సంపత్, వేల్పుల వేణు, గుండు సదానందం, పెరుకారి శ్రీధర్, గండ్రకోట రాకేష్ యాదవ్, మంద సృజన్ కుమార్, తక్కళ్లపల్లి వినీల్ రావు, సాయి, సన్నీ, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
