హైదరాబాద్, ఆంధ్రప్రభ : సీతారామ ప్రాజెక్టు నుంచి సాగు నీటిని శనివారం విడుదల చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) చొరవతో సీతారామ ప్రాజెక్టు నుంచి అధికారులు గోదావరి జలాలను విడుదల చేశారు. అశ్వాపురం (Ashvapuram) మండలం బీజీ కొత్తూరు వద్ద మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ నుంచి శనివారం ఉదయం నీటిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) కృతజ్ఞతలు తెలిపారు.
రైతుల వినతికి స్పందించిన మంత్రి తుమ్మల..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న దృష్ట్యా సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు. నాగార్జున సాగర్లో ఇన్ఫ్లో పెరిగినప్పటికీ తగినంత నీరు చేరలేదు. దీంతో ఇప్పట్లో సాగర్ ఎడమ కాలువల ద్వారా నీరు విడిచిపెట్టే అవకాశం లేదు. దీనికి ప్రత్యామ్నాయంగా సీతారామ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోక్యం..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్న దృష్ట్యా రైతుల వినతికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఈ విషయమై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సంప్రదించారు. పరిస్థితి వివరించారు. ఈ విషయమై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతోనూ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి శనివారం ఉదయం సమీక్ష చేశారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు విడుదల చేశారు.