పాశమైలారం సీగాచి కెమికల్స్ లో పేలిన రియాక్టర్
దట్టమైన పొగతో.. ఎగసిపడిన మంటలు
మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది
కుప్పకూలిన ప్రొడెక్షన్ భవనం
శిథిలాలను తొలగిస్తున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది
ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనం. 20 మందికి పైగా గాయాలు
మృతుల సంఖ్య మరింత పెరిగే చాన్స్
కొనసాగుతున్న రెస్క్యూ
ప్రమాదంపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆరా
ఘటనా స్థలిని పరిశీలించిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశం
అవసరమైతే హైదరాబాద్ తరలించాలని సూచన
దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు
ఉమ్మడి మెదక్ బ్యూరో, (ఆంధ్రప్రభ) సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు (Patancheru) పరిధిలోని పాశమైలారం (Pasamylaram ) పారిశ్రామిక వాడలో ఘోర ప్రమాదం జరిగింది. పాశమైలారంలో ఉండే సీగాచి కెమికల్స్ (Sigachi Chemicals ) పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ (Reactor ) ఒక్కసారిగా పేలింది. రియాక్టర్ బ్లాస్ట్ అవ్వడంతో మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు గాల్లోకి ఎగిరి సుమారు 100 మీటర్ల దూరంలో పడ్డారు.. ఈ ఘటనలో ఇప్పటి వరకు 10 మంది కార్మికులు(Labour) దుర్మరణం చెందారు. మరో. 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు (Injured ) .
వివరాలలోకి వెళితే పటాన్ చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం ఉదయం పరిశ్రమలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. పేలుడు దాటికి ప్రొడెక్షన్ భవనం కుప్పకూలింది. భవన శిథిలులు కిలోమీటర్ మేర ఎగిసిపడ్డాయి.. భవనం శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి రెండు ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలు ఆర్పుతున్నాయి. డిజాస్టర్ టీమ్ కూడా సంఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యల్లో తలమునకలైంది. ప్రమాదంలో ఇప్పటి వరకు 10 మంది కార్మికులు మృతి చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డట్లు సమాచారం. . గాయపడిన వారిని అంబులెన్సులలో చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.. ఫైర్ సిబ్బంది, సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యారు.
8 మంది సజీవదహనం…
సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఉదయం 9 గంటల సమయంలో రియాక్టర్ పేలింది. ఉదయం 8 గంటల షిఫ్టులో సీగాచి కెమికల్స్ లో మొత్తం 90 మంది కార్మికులు ఉదయం షిఫ్ట్ లో పనిచేస్తున్నారు. రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా అగ్నికీలలు వేగంగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 8 మంది కార్మికులు సజీవదహనం అయ్యారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స నిమిత్తం పటాన్ చెరులోని ధృవ, కాకతీయ ఆస్పత్రికి తరలించగా.. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కొనసాగుతున్న రెస్క్యూ
సీగాచి కెమికల్స్ లో రియాక్టర్ పేలుడు దాటికి పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ప్రొడెక్షన్ భవనం కుప్పకూలింది.. కంపెనీ బస్సులు సైతం పాక్షికంగా దెబ్బతిన్నాయి. కంపెనీ నుంచి దట్టమైన పొగతోపాటు ఘాటైన రసాయన వాసనలు వెలుడుతుండడంతో స్థానికంగా వాయు కాలుష్యం ఏర్పడింది. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. పరిశ్రమ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు పరిశ్రమ వద్దకు చేరుకుంటున్నారు. ఫైర్, డిజాస్టర్ రెస్క్యూ టీమ్ ఇంకా రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. ఘటన స్థలానికి స్థానికులు ఎవరూ రావద్దని పోలీసుకు హెచ్చరికలు జారీ చేశారు. మీడియాకు సైతం ఆంక్షలు పెట్టారు.
సీగాచి పరిశ్రమ అగ్నిప్రమాదాన్ని పరిశీలించిన మంత్రి దామోదర
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సీగాచి పరిశ్రమలో జరిగిన ఘోర పేలుడు స్థలాన్ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పరిశీలించారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్ ప్రవీణ్యను మంత్రి ఆదేశించారు. వెంటనే పేలుడు జరిగిన ఫ్యాక్టరీ స్థలంలో సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయాన్ని అందించేలా చర్యలు చేపట్టాలని అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ జిల్లా కలెక్టర్ ప్రవీణ్య గారిని ఆదేశించారు.మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ గార్లు ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్లలో పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
ప్రమాద తీవ్రతపై సంగారెడ్డి కలెక్టర్, ఎస్పీ ఆరా..
కెమికల్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. శిథిలాల కింద చిక్కున్న వారికి వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డ్యూటీలో ఎంత మంది పనిచేస్తున్నారని.. ప్రమాదంలో గాయపడ్డ వారి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.