శ్రీశైలం, ఆంధ్రప్రభ : మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి వరద పోటెత్తుతోంది. పైనుంచి వస్తున్న వరద నీటితో జూరాల డ్యామ్కు వరద నీరు చేరుతోంది. ఈ సీజన్లో రెండోసారి అధికారులు డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది.
శ్రీశైలం డ్యామ్ నెమ్మదిగా జల కళ సంతరించుకుంటోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 60,587 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోందని అధికారులు చెప్పారు. అయితే, డ్యామ్ నుంచి ప్రస్తుతానికి నీటిని వదలడంలేదు. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 854.20 అడుగులకు చేరింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 215.7080 టీఎంసీలు, ప్రస్తుతం 89.7132 టీఎంసీలకు చేరిందని అధికారులు వివరించారు. ప్రస్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశామని చెప్పారు.