బిజినెస్మన్ బషరత్ ఖాన్ అరెస్ట్
విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
అన్నీ హైఎండ్ మోడల్ కార్లే
తక్కువ ధరకు ఇన్వాయిస్ కొటేషన్
పొలిటికల్ లీడర్లతో సన్నిహిత సంబంధాలు
అమెరికా, జపాన్ నుంచి వాహనాల కొనుగోలు
దుబాయ్, శ్రీలంకలో మోడిఫికేషన్లు
పూర్తిగా నగదు రూపంలోనే వాహన అమ్మకాలు
బ్లాక్ మనీని వైట్ చేసేందుకు యత్నాలు
ఫోకస్ పెట్టిన డీఆర్ఐ అధికారులు
పక్కా ఆధారాలు సేకరించి అరెస్టు
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ :
హైదరాబాద్ గచ్చిబౌలిలోని కార్ లాంజ్ షోరూమ్ యజమాని, నగరానికి చెందిన వ్యాపారవేత్త బషరత్ ఖాన్ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) హై-ఎండ్ లగ్జరీ కార్ల దిగుమతికి సంబంధించి దాదాపు ₹100 కోట్ల భారీ కస్టమ్స్ సుంకం మోసం కేసులో అరెస్టు చేసింది. నిర్దిష్ట సమాచారం ఆధారంగా, భారతీయ ఓడరేవుల్లో ఉద్దేశపూర్వకంగా తక్కువ ఇన్వాయిస్లు ఇవ్వడం, తప్పుగా ప్రకటించడం ద్వారా లగ్జరీ వాహనాలను దాదాపు 50శాతం తక్కువ విలువతో భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నట్లు DRI కనుగొంది. సూరత్లోని DRI అధికారులు బషరత్ను అరెస్టు చేసి అహ్మదాబాద్లోని ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరిచారు. దాదాపు ₹100 కోట్ల మోసం జరిగిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. నిందితుడు పలు రాజకీయ నాయకులకు, ప్రముఖులకు కార్లను అందించేవాడని తెలుస్తోంది.
పదేండ్లుగా కార్ల అమ్మకాలు..
కార్ లాంజ్ అనే షోరూమ్ హైదరాబాద్లోని రాయదుర్గ్-గచ్చిబౌలి రోడ్డులో ఉంది. నిందితుడు నాంపల్లి, విజయ్ నగర్ కాలనీకి చెందినవాడు. అతని అన్నయ్యకు రెండు వర్క్షాప్లు ఉన్నాయి. “గత 10 సంవత్సరాలుగా, షోరూమ్ హైదరాబాద్లో పనిచేస్తోంది. గతంలో, అతను చిన్న కార్లను అమ్మేవాడు, కానీ తర్వాత బషరత్ ఖరీదైన కార్లను అమ్మడం ప్రారంభించాడు. ఈ కార్లను షోరూమ్లో ప్రదర్శనకు ఉంచారు. అనేక వాహనాలను వీఐపీలకు అమ్మారు. కార్లను రాజకీయ నాయకులు ఉపయోగించడానికి అద్దెకు కూడా ఇచ్చారు. కొంతమంది పార్లమెంటు సభ్యులతో బషరత్కు మంచి సంబంధాలున్నాయి.” అని” అతని సన్నిహితుల్లో ఒకరు చెప్పారు.
సాధారణ జీవితం నుంచి బడా వ్యాపారవేత్తగా..
నాంపల్లిలోని విజయ్ నగర్ కాలనీలో సాధారణ జీవితం ప్రారంభించిన బషరత్, రాజకీయ నాయకుల్లోని తన నెట్వర్క్ ద్వారా వేగంగా ఎదిగారు. ఢిల్లీ నుంచి వచ్చిన రాజకీయ నాయకులకు హై ప్రొఫైల్ పార్టీలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందారు. ఇక.. పన్నులు ఎగవేసేందుకు కస్టమర్లు బష్రత్కు నగదు రూపంలో చెల్లింపులు జరిపేవారని తెలుస్తోంది. అంతేకాకుండా బష్రత్ భాగస్వామి డాక్టర్ అహ్మద్, మరో ఇద్దరికి సంస్థలో భాగస్వామ్యం ఉంది. పన్నులు చెల్లించకుండా ఉండటానికి, బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి కూడా అతని కస్టమర్లలో చాలామంది ‘నగదు’ ద్వారా కార్లను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆయన, తన తెలివితేటల కారణంగా త్వరగానే ధనవంతుడయ్యారని ప్రచారం.
మోసం ఎలా జరిగిందంటే..
అమెరికా, జపాన్ నుంచి కొనుగోలు చేసిన వాహనాలను మొదట దుబాయ్ లేదా శ్రీలంకకు ఎడమ-చేతి డ్రైవ్ నుంచి కుడి-చేతి డ్రైవ్ (RHD)కు మార్చేవారు. ఈ మార్పుల తర్వాత వాహనాల విలువను గణనీయంగా తగ్గించే పత్రాలను ఉపయోగించి కార్లను భారతదేశంలోకి దిగుమతి చేసుకున్నారు. దీంతో గణనీయమైన కస్టమ్స్ సుంకాలను ఎగవేశారనే అభియోగాలున్నాయి.
అన్నీ హైఎండ్ లగ్జరీ కార్లే..
ఖరీదైన కార్లలో హమ్మర్ EV, కాడిలాక్ ఎస్కలేడ్, రోల్స్ రాయిస్, లెక్సస్, టయోటా ల్యాండ్ క్రూయిజర్, లింకన్ నావిగేటర్ వంటి ప్రీమియం మోడళ్లతో సహా 30కి పైగా లగ్జరీ వాహనాలను ఈ పద్ధతిని ఉపయోగించి దేశంలోకి తీసుకువచ్చారని దర్యాప్తులో తేలింది. హైదరాబాద్, ముంబై, పూణే, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీతో సహా ప్రధాన నగరాల్లో ఆ కార్లను అమ్మేశారు. ఇట్లా సుంకం ఎగవేత అంచనా దాదాపు ₹25 కోట్లు దాటిందని తెలుస్తోంది.
ఒకరిని అరెస్టుతో బషారత్ దొరికాడిలా..
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కీలక దిగుమతిదారుల్లో ఒకరిని DRI అరెస్టు చేసింది. అతను అలాంటి ఎనిమిది లగ్జరీ వాహనాలను దిగుమతి చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. దీని ఫలితంగా ₹7 కోట్లకు పైగా కస్టమ్స్ సుంకం ఎగవేత జరిగింది. అహ్మదాబాద్లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ మోసపూరిత దిగుమతులకు దోహదపడ్డారని.. వాటి నుంచి ప్రయోజనం పొందారని అనుమానాలున్న ఇతర దిగుమతిదారులపై DRI దర్యాప్తు కొనసాగిస్తోంది.
బషారత్ నుంచి కొనుగోలు చేసిందెవరు?
ఈ క్రమంలో బషారత్ నుంచి 10 కార్లు కొనుగోలు చేసినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ కస్టమర్లను గుర్తించడానికి DRI వెతుకుతోంది. బషారత్ యాజమాన్యంలోని షోరూమ్లో.. షోరూమ్ వెనుక ఒక ఇన్-హౌస్ వర్క్షాప్ ఉంది. అక్కడ అనేక కార్లకు సంబంధించిన ఉపకరణాలు లభించడమే కాకుండా, మోడిఫికేషన్లు కూడా చేస్తుంటారని డీఆర్ఐ గుర్తించింది.