పండుగలు, వేడుకలు వున్న రోజుల్లో హూమాలు, యజ్ఞాలు, వ్రతాలు చేస్తుంటారు. పాపదోషాలు తొలగిపోయి సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్థిల్లాలని దేవుళ్లను కొలుస్తారు. మ్రొక్కలు మ్రొక్కుకుంటారు. కోర్కెలు తీరిపోగానే దేవాలయాలకు వెళ్లి తీర్చుకుంటారు. లేకుంటే అరిష్టం జరుగుతుందేమోననే భయం కూడా ఉంటుంది.
రాను రాను మనిషికి ఆలోచనలు ఎక్కువై పోయాయి. కోరికలు తోడయ్యాయి. దైవపూజలు చేస్తూనే కోర్కెలు దేవుడి ముందు ఏకరువు పెడుతున్నారు. దేవుడికి సేవ చేయాలి కానీ కోరికలు కోరడం సరికాదు. మనిషి తలరాతను వ్రాసింది ఆయనే కదా!
కోరికలు తీరుతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే మనిషి యొక్క భూత, భవిష్యత్, వర్తమానా లన్నింటినీ ఆ సృష్టికర్త ఆ మనిషి నొసటనే ముందుగానే వ్రాస్తాడు. మంచి అయినా, చెడు అయినా జరిగిపోతూనే వుంటాయి. బ్రహ్మదేవుడు వ్రాసిన వ్రాతను మార్చి వ్రాయడం అసాధ్యం. ఏది జరగాలనుందో అదే జరుగుతుంది. అలాంటి పాప, పుణ్యాలన్నీ కూడా గత జన్మలోని కర్మల ఫలితాలుగానే భావించాలి. ఫలానా పని జరిగితే నీకు కొబ్బరికాయలు కొడతాను, అన్నదానాలు, వస్తద్రానాలు నిలువుదోపిడీ ఇస్తామని మ్రొక్కుకుంటారు. మనం మానవమాత్రులం కాబట్టి ఇలాంటి ఆలోచనలు, కోర్కెలు ఉండటం సహజం.
ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు సాందీప మహర్షి గురువు దగ్గర అన్ని విద్యలూ నేర్చుకుంటాడు. శ్రీకృష్ణుడు సాందీప మ#హర్షిని గురుదక్షిణగా ఏం కావాలో కోరుకోమంటాడు. సాందీప మహర్షి భార్యతో చర్చించి చనిపోయిన తమ కుమారున్ని తిరిగి ఇవ్వాలని కోరతాడు. కోరిన వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు వారి కోరికను నెరవేరుస్తాడు. అంతటి గొప్ప మ#హర్షి కూడా భగవంతుడు వరం కోరుకొమ్మంటే ఏమీ పాలుపోక తన కొడుకునిస్తే చాలని అంటాడు. అంతటి మేధావికన్నా మామూలు మనుషులం మనం ఆ భగవంతుడు ప్రత్యక్షమైతే ఎలాంటి కోరికలు కోరే అవకాశం లేదు. కాబట్టి దైవసేవ చేయడం మానవ జన్మ ఎత్తిన పుణ్యమే. ఇక పాపపుణ్యాలన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలుగానే భావిస్తే అంతా శుభమే..
భక్తుడు పురోగతి సాధించినప్పుడు నీటి రుచిలో దేవుడిని అనుభవిస్తాడు, అతను సూర్య, చంద్రుని కాంతిలో దేవుడిని చూస్తాడు, అతను ఏదైనా శబ్దం విన్నప్పుడు భగవంతుణ్ణి చూస్తాడు. కృష్ణుడు భగవద్గీతలో ”మనిషిలో నేనే సామర్ధ్యం” అని చెప్పాడు.
మొదట దుర్గుణాలను జయిస్తే సమాజంలో దేన్నైనా జయించటానికి అర్హత లభిస్తుంది. ఇంట గెలిచి రచ్చ గెలవడం అంటే అదే. జీవనంలో ధర్మాచరణ ద్వారానే మనం దోషాలన్నింటిని పరిహరించగలం. పురాణాలు, ధర్మ శాస్త్రాలు, అవతార పురుషుల జీవితాలు మనకు సహనాన్ని బోధిస్తున్నాయి. భారతీయ హృదయానికి ఆయువు పట్టు లాంటి సహనాన్ని వదిలి ధ్యానం మాత్రమే చేయాలనుకోవటం అత్యాశే అవుతుంది. శ్రీకృష్ణుడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు. తన పన్నెండవ ఏట శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తాడు. బ్రహ్మకు సైతం అంతుచిక్కని శక్తిని ప్రదర్శించాడు. అయినా ఆయన వచ్చిన పనులన్నీ పూర్తి చేయటానికి 120 సంవత్సరాల కాలం జీవించాల్సి వచ్చింది. మన జీవన పరమార్థమే మిటో, వచ్చిన పనేమిటో, మనకు తెలియకపోవచ్చు ! కానీ అవతరించిన దైవానికి అన్నీ తెలుసు. సహనం నేర్పటం కూడా అవతార రహస్యంలో భాగం కాబట్టి వారు కూడా కాలానుగుణంగానే వ్యవహరించారు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడి మనసులు వేరైనా అనుసరించిన ధర్మం, ఆచరించి చూపిన సచ్ఛీలం ఒక్కటే. శ్రీరాముని పూజించడం అంటే ఆయన సద్గుణాలను అలవర్చుకోవటం. సద్గుణ సంపత్తితో దేన్నైనా జయించవచ్చు !
భౌతిక జీవనానికి తక్కువ ప్రాధాన్యతనిచ్చి, అంతర్గత జీవనాన్ని అత్యుత్తమ జీవనంగా చాటిచెప్పిన దేశం మనది. పాశ్చాత్య విధానాల అనుకరణ మనకు లౌకిక, ఆధ్యాత్మిక జీవితాల్లో శాంతి లేకుండా చేస్తుంది. ఏ విషయం లోనైనా ఫలం కోసం కాలం వచ్చేవరకు వేచి ఉండటం సహనం. మనం ఋషుల్లాగా సమాజాన్ని, లౌకిక జీవనాన్ని వదిలివెళ్లి సాధన చేయలేం. కనుక బాల్యం నుండి వృద్ధాప్యం వరకు అన్ని దశల్లోనూ ధర్మ జీవనం ద్వారా మాత్రమే ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలుగుతాం. కానీ నేటి పోకడలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఒకప్పటి సమాజంలోని ప్రేమాభిమానాలు ఇప్పుడు వ్యామోహాలుగా మారుతున్నాయి. బాల్యంలో మొదలైన మోజు యవ్వన ప్రాయానికి విచ్చలవిడితనంగా మారుతుంది. మన సంస్కృతిలో ఎంతో ఉన్నతమైన వైవాహిక వ్యవస్థలో కూడా దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శాంతిని దూరంచేసే విధానాలవైపు పరుగులు పెడుతూ ధ్యానంద్ఖైవం వంటి ఆధ్యాత్మిక సాధనలకు పూనుకోవటం వృథా ప్రయాసే అవుతుంది. కలుపుమొక్కలను తీయకుండా సేద్యం ఎలా సాధ్యం కాదో అలాగే మనలోని దుర్గుణాలను తొలగించకుండా శాంతి, తృప్తిలను పొందటం సాధ్యంకాదు. సద్గుణాలను అలవర్చుకొని, మనసు ఉధృతికి కళ్ళెంవేసే సహనం లేకుండా ధ్యానంగానీ, జపంగానీ సిద్ధించవు. అందుకే మన నిత్య జీవితంలోనే సహనాన్ని అలవర్చుకుంటే ఆధ్యాత్మిక సాధనకు అవసరమైన మార్గాన్ని సుగమం చేసుకోగలుగుతాం. మాణిక్యము కోసం మట్టిలో వెదుకుతూ ఉంటే ఏ అదృష్టవంతునికో అది లభించవచ్చు. చాలా మందికి లభించకపోవచ్చు. కాని తనలోనే ఓపికతో వెదికినా గాలించినా ఆత్మ అనే మాణిక్యము తప్పక లభిస్తుంది.
- ఆనంద ‘మైత్రేయ’మ్