వ్యసనాలను వీడండి – నవ సమాజాన్ని నిర్మించండి…

వ్యసనాలను వీడండి – నవ సమాజాన్ని నిర్మించండి…

  • ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు
  • ప్రారంభించిన జిల్లా ఎస్పీ
    వ్యసన రహిత సమాజమే లక్ష్యం..
    జిల్లా ఎస్పి యం రాజేష్ చంద్ర

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మనిషి జీవితం ప్రకృతి ప్రసాదించిన ఒక అమూల్యమైన వరం. కానీ, ఆ క్షణికానందం ఇచ్చే మత్తు పదార్థాల మాయలో పడి ఎందరో తమ బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి వ్యసనానికి బానిసలైతే అది కేవలం వారి సమస్య మాత్రమే కాదు.. ఆ కుటుంబం మొత్తం చీకట్లోకి నెట్టబడుతుంది, సమాజం తన శక్తిని కోల్పోతుంది. ఇలాంటి కష్టాల్లో ఉన్న వారికి ఆశాదీపంలా నిలిచి, వారిలో పరివర్తన తీసుకువచ్చి, తిరిగి సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ‘డి-అడిక్షన్’ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

మత్తు కోరల్లో చిక్కుకున్న వారు ఆ చీకటిని వీడి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, సమాజంలోని ప్రతి పౌరుడు ఈ మార్పులో తోడుగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కామారెడ్డి జిల్లా పోలీస్ యంత్రాంగం పిలుపునిస్తోందని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా, కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డి-అడిక్షన్ (వ్యసన విముక్తి) కేంద్రాన్ని జిల్లా ఎస్పీ యం.

రాజేష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం వివిధ రకాల మత్తు పదార్థాలకు బానిసలైన వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి, వారిని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి ఈ కేంద్రం ఎంతో దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు డ్రగ్స్ లేని స్వచ్ఛమైన సమాజాన్ని అందించడమే ప్రభుత్వ పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

జిల్లాలో అమలువుతున్న ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల ప్రణాళిక ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేస్తున్నామని, ప్రజల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్పీ తెలిపారు. డ్రగ్స్, గంజాయి వంటి మహమ్మారుల వల్ల కేవలం తీసుకునే వారే కాకుండా, సమాజం మొత్తం ప్రభావితమవుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని, పాఠశాలలు బహిరంగ ప్రదేశాల్లో భద్రత కరువవుతోందని హెచ్చరించారు.

డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ టీమ్’ గురించి వివరిస్తూ, ప్రజల నుండి వచ్చే సమాచారం ఈ పోరాటంలో అత్యంత కీలకమని, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు ప్రైవేట్ ఆసుపత్రులకు ఏమాత్రం తీసిపోవని, సామాన్య ప్రజలు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా రెండో అంతస్తులో డి-అడిక్షన్ సెంటర్ కోసం ప్రత్యేక వార్డును కేటాయించడం, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్ పర్యవేక్షణలో చికిత్స అందించడం హర్షణీయమని పేర్కొన్నారు.

వైద్య సిబ్బంది రోగుల ప్రవర్తనను గమనిస్తూ, వారికి మానసిక ధైర్యాన్ని అందించి వ్యసనాల నుండి విముక్తి చేయాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్, గంజాయి వంటి వ్యసనాలకు దూరంగా ఉంటామని, డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములమవుతామని” కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

ఈ ప్రతిజ్ఞ ప్రజల్లో అధికారుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్పీ చైతన్య రెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యాదగిరి గారు, ఆర్.ఎం.ఓ గారు, డాక్టర్ రవీందర్ గౌడ్, సైకియాట్రిస్ట్ డాక్టర్ వివేక్ కుమార్, పట్టణ ఎస్.హెచ్.ఓ నరహరి ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply