PM Surya Ghar : ఊరూరా.. సూర్య ఘర్ Andhra Prabha SPL Story

PM Surya Ghar : ఊరూరా.. సూర్య ఘర్ Andhra Prabha SPL Story
PM Surya Ghar | ఇంటింటా సౌర క్రాంతి
300 యూనిట్ల కరెంటు ఉచితం
తక్కువ వడ్డీ రుణ సదుపాయం
75885 మంది దరఖాస్తు
8.61 కోట్ల సబ్సిడీ విడుదల –
మెగావాట్ల స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి
ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం
ఇటు పర్యావరణ పరిరక్షణ
తలసరి ఆదాయ వనరుగా సౌరశక్తి
చిత్తూరు జిల్లా ట్రాన్స్ కో బిజీబిజీ
1210 మందికి 8.61 కోట్ల సబ్సిడీ విడుదల
(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు)

PM Surya Ghar ః దేశంలో పెరుగుతున్న విద్యుత్ ఖర్చుల నేపథ్యంలో సాధారణ, మధ్యతరగతి కుటుంబాలకు దీర్ఘకాలిక ఉపశమనం కలిగించే మహత్తర పథకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన దేశవ్యాప్తంగా శక్తివంతంగా అమలవుతోంది. 2024 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక యోజన ద్వారా ఒక కోటి కుటుంబాలకు రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసి నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. ఇంటి పైకప్పులపై సౌర ఫలకాలను ఏర్పాటు చేసుకునే గృహ యజమానులకు భారీ సబ్సిడీతో పాటు తక్కువ వడ్డీ రుణ సదుపాయం కల్పించడం ఈ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేసింది. చిత్తూరు జిల్లాలో ఏ పథకం కింద 75,885 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 62,696 కుటుంబాలకు సోలార్ ప్యానల్స్ అమర్చడం సాధ్యమవుతుందని నివేదిక ఇచ్చారు. ఇప్పటివరకు 1,385 మందికి సోలార్ ప్యానర్స్ అమర్చడం పూర్తయింది. 1210 మందికి 8.61 కోట్ల రూపాయలను సబ్సిడీగా విడుదల చేశారు.

ఈ పథకం కింద లబ్ధిదారులు తమ ఇంట్లో వినియోగించే విద్యుత్ ఖర్చును గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు, అవసరానికి మించి ఉత్పత్తి అయ్యే సౌర విద్యుత్ను గ్రిడ్కు విక్రయించి అదనపు ఆదాయం కూడా పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. సగటున నెలకు రూ.1000 నుంచి రూ.1200 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఇది కేవలం విద్యుత్ పథకం మాత్రమే కాకుండా ఆదాయ వనరుగా కూడా మారుతోంది. ముఖ్యంగా సూర్య కాంతి సమృద్ధిగా లభించే ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అత్యంత ఫలప్రదంగా నిలుస్తోంది. సబ్సిడీ విషయానికి వస్తే, 1 నుండి 2 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ వ్యవస్థలకు రూ.30,000 నుంచి రూ.60,000 వరకు, 2 నుండి 3 కిలోవాట్ల ప్లాంట్లకు రూ.60,000 నుంచి రూ.78,000 వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తోంది. 3 కిలోవాట్లకు పైబడిన వ్యవస్థలకు గరిష్టంగా రూ.78,000 వరకు రాయితీ లభిస్తుంది. అదనంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా సుమారు 6.75% నుండి 7% వరకు తక్కువ వడ్డీ రేటుతో రూ.2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణ సదుపాయం కూడా అందుబాటులో ఉండటం మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరటగా మారింది.

PM Surya Ghar అర్హతలు ఏమింటంటే
అర్హతల పరంగా భారతీయ పౌరుడు అయి, సొంత ఇల్లు ఉండి, సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు తగిన పైకప్పు ఉండాలి. చెల్లుబాటు అయ్యే విద్యుత్ కనెక్షన్ తప్పనిసరి. గతంలో సోలార్ కోసం ప్రభుత్వ సబ్సిడీ పొందకపోవడం మరో ముఖ్యమైన నిబంధన. పూర్తిగా ఆన్లైన్లో జరిగే దరఖాస్తు ప్రక్రియ ద్వారా రాష్ట్రం, డిస్కామ్, కన్స్యూమర్ నంబర్ నమోదు చేసి అప్లై చేయవచ్చు. డిస్కామ్ ఫీజిబిలిటీ ఆమోదం అనంతరం గుర్తింపు పొందిన వెండర్ ద్వారా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, నెట్ మీటరింగ్, తనిఖీ పూర్తైన తర్వాత 30 రోజుల్లో సబ్సిడీ నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఇలాంటి జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పథకానికి చిత్తూరు జిల్లాలో విశేష స్పందన లభించడం గమనార్హం.

జిల్లాలో సౌరశక్తి వినియోగంపై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో భారీ స్థాయిలో నమోదులు జరుగుతున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు 75,885 మంది ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు.

ఇందులో 62,696 మందికి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఫీజిబిలిటీ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. తదుపరి దశలో 7,951 మందిని ఎంపిక చేయడం ద్వారా అమలు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 1,385 కుటుంబాల ఇళ్లపై సూర్య ఘర్ పథకం కింద రూఫ్టాప్ సోలార్ ప్యానెల్స్ విజయవంతంగా అమర్చారు. వాటిలో 1,293 ఇళ్లకు ఇన్స్పెక్షన్ ప్రక్రియ పూర్తయింది. 1,210 మందికి సబ్సిడీ కోసం ప్రతిపాదనలు పంపగా, ఇప్పటికే 1,139 మందికి సబ్సిడీ విడుదల కావడం ఈ పథకం సమర్థవంతమైన అమలుకు నిదర్శనం. లబ్ధిదారులకు ఇప్పటివరకు మొత్తం రూ.8.61 కోట్ల సబ్సిడీ నేరుగా విడుదల చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహాయం ప్రజలకు వేగంగా చేరుతోంది. ఇప్పటివరకు జిల్లాలో అమర్చిన సోలార్ ప్యానెల్స్ ద్వారా సుమారు 4.568 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఏర్పడింది. ఇది భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించనుంది. స్వచ్ఛమైన శక్తి వినియోగాన్ని పెంచడంలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
PM Surya Ghar : ఎస్సీ, ఎస్టీలకు తప్పని సరి

కుప్పం రెస్కో పరిధిలో మొత్తం ఎస్సీ, ఎస్టీ కులాల 2,180 ఇళ్లు ఉండగా ఇప్పటివరకు 320 కుటుంబాల ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చారు. మరో 573 ఇళ్లలో ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌరశక్తి పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా తెలియజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 21,530 కుటుంబాలు ఈ పథకానికి అనుకూలంగా ఉండగా ఇప్పటివరకు 5,349 మంది అధికారికంగా దరఖాస్తు చేయడం విశేషం.

విద్యుత్ బిల్లుల భారంతో ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ పథకం నిజమైన వరంగా మారుతోంది. ఒకసారి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న తర్వాత సంవత్సరాల పాటు తక్కువ ఖర్చుతో విద్యుత్ వినియోగం సాధ్యమవుతుంది. అదనంగా ఉత్పత్తి అయ్యే విద్యుత్ ద్వారా ఆదాయం పొందే అవకాశం ఉండటంతో ఇది ఆర్థిక భద్రతకు కూడా దోహదం చేస్తోంది. పర్యావరణ పరిరక్షణ, విద్యుత్ స్వావలంబన, కుటుంబాల ఆర్థికాభివృద్ధి అనే మూడు లక్ష్యాలను ఒకేసారి సాధించే సమగ్ర ప్రజాప్రయోజన పథకంగా పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన నిలుస్తోంది.

మొత్తం మీద చూస్తే, చిత్తూరు జిల్లాలో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ఒక సౌర విప్లవంగా మారుతోంది. భారీ స్థాయిలో నమోదులు, వేల ఇళ్లలో సోలార్ వ్యవస్థల ఏర్పాటు, మెగావాట్ల స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి, కోట్ల రూపాయల సబ్సిడీ విడుదల వంటి పరిణామాలు ఈ పథకం విజయాన్ని స్పష్టంగా చాటుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత మంది లబ్ధిదారులు చేరడంతో చిత్తూరు జిల్లా సౌరశక్తి వినియోగంలో రాష్ట్రంలోనే ముందంజలో నిలిచి, శక్తి స్వావలంబన దిశగా ఆదర్శ జిల్లాగా నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ALSO READ : cbn bc spark : బీసీకి కత్తికి సాన Amdhra Prabha insight Story
