ఖమ్మం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడో రైల్వే లైన్ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేషన్ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను నేటి నుంచి 13వ తేదీ వరకు రద్దు చేశారు. ఈ మేరకు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎండీ జాఫర్ తెలిపారు. గుంటూరు, కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య పలు రైళ్లు పాక్షికంగా రద్దు కాగా, మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తించి సహకరించాలని కోరారు.
దారి మళ్లించిన రైళ్లలో విశాఖ-న్యూఢిల్లీ, విశాఖ-గాంధీధామ్, హైదరాబాద్-షాలీమార్, ముంబై-భువనేశ్వర్, షిర్డీ-కాకినాడ, షిర్డీ-మచిలీపట్నం, ఎర్నాకుళం-బరౌనీ రైళ్లు ఉన్నాయి. అలాగే, రద్దయిన రైళ్లలో డోర్నకల్-విజయవాడ, విజయవాడ-భద్రాచలం రోడ్, గుంటూరు-సికింద్రాబాద్, విజయవాడ-సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, ఇండోర్-కొచ్చివెల్లి, కోర్బా-తిరువనంతపురం, గోరఖ్పూర్-కొచ్చివెల్లి, హిస్సార్-తిరుపతి రైళ్లు ఉన్నాయి. గుంటూరు-సికింద్రాబాద్, సికింద్రాబాద్-గుంటూరు రైళ్లను రేపటి నుంచి ఈ నెల 13 వరకు రద్దు చేశారు.