KNL | 6 బాలల సంరక్షణ సంస్థల నిర్వహణకు సిఫార్సులు : కలెక్టర్ పి.రంజిత్ బాషా

కర్నూలు, జూన్ 25, (ఆంధ్రప్రభ) : జిల్లాలో అర్హత కలిగిన 6 బాలల సంరక్షణ సంస్థలను నిర్వహించేందుకు సిఫార్సు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా (Collector Ranjit Basha) అనుమతులు జారీ చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాలల సంరక్షణ సంస్థల జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జువెనైల్ జస్టిస్ చట్టం 2015 ప్రకారం అర్హత కలిగిన బాలల సంరక్షణ సంస్థలకు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (Registration Certificate) జారీ చేసేందుకు జిల్లా స్థాయి సిఫార్సుల కమిటీ ఆధ్వర్యంలో తనిఖీ చేసి సిఫార్సులు చేయడం జరుగుతుందన్నారు. ఆ మేరకు జిల్లాలో ప్రభుత్వం, ఎన్జీఓల ద్వారా నడిపిస్తున్న 9 బాలల సంరక్షణ సంస్థలు దరఖాస్తు చేసుకోగా, నిర్దేశించిన ప్రమాణాల మేరకు వాటిలో ఉన్న వసతులను పరిశీలించడం జరిగిందన్నారు. ఇందులో 6 సంస్థలు అర్హత కలిగినవిగా సిఫార్సు చేశామని కలెక్టర్ తెలిపారు. జువెనైల్ అబ్జర్వేషన్ హోమ్, శిశు గృహాల నిర్వహణ గురించి కలెక్టర్ ఐసీడీఎస్ పీడీని అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఇబ్బంది కలగకుండా బాలల సంరక్షణ సంస్థలను సక్రమంగా నడపాలని కలెక్టర్ సూచించారు.

సమావేశంలో అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా, జువెనైల్ శాఖ జిల్లా ప్రొబేషన్ ఆఫీసర్ దివాకర్, ఐసిడిఎస్ పిడి నిర్మల, సి డబ్ల్యూ సి చైర్మన్ జుబేదా బేగం, డిసిపిఓ శారద, జువెనైల్ జస్టిస్ బోర్డ్ మెంబర్ సునీత, అబ్జర్వేషన్ హోమ్ సూపరింటెండెంట్ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply