ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఐపీఎల్ మ్యాచ్ల (IPL matches)ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూసే అభిమానులకు షాక్ తగలనుంది. జీఎస్టీ (GST) పన్ను విధానంలో చేసిన కీలక మార్పుల కారణంగా ఇకపై ఐపీఎల్ టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఐపీఎల్ వంటి ప్రీమియం క్రీడా ఈవెంట్లపై 40 శాతం పన్ను విధించాలని కేంద్రం నిర్ణయించింది.
నాలుగు శ్లాబుల స్థానంలో రెండే..
ప్రస్తుతం ఉన్న 5, 12, 18, 28 శాతం అనే నాలుగు శ్లాబుల స్థానంలో కేవలం 5, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కొత్త శ్లాబ్ పరిధిలోకి ఐపీఎల్ను కూడా ‘ప్రీమియం లీగ్’గా పరిగణించి చేర్చారు. ఇప్పటివరకు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై 28 శాతం జీఎస్టీ ఉండగా, తాజా నిర్ణయంతో అది 40 శాతానికి పెరగనుంది. ఉదాహరణకు, రూ. 1000 విలువైన టికెట్కు పాత పన్ను విధానంలో రూ. 1280 చెల్లించాల్సి ఉండగా, కొత్త విధానం ప్రకారం రూ. 1400 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రతి టికెట్పై అదనంగా రూ. 120 భారం పడుతుంది.
వాటికి వర్తించదు..
అయితే, జాతీయ (National), అంతర్జాతీయ (international) సమాఖ్యల గుర్తింపు పొందిన క్రీడా ఈవెంట్లకు ఈ 40 శాతం పన్ను వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టీమిండియా (Team India) ఆడే మ్యాచ్లు, అంతర్జాతీయ హాకీ వంటి ఈవెంట్లు దీని పరిధిలోకి రావు. రూ. 500 లోపు టికెట్లపై పూర్తి మినహాయింపు ఉండగా, రూ. 500 దాటిన టికెట్లపై పాత పద్ధతిలోనే 18 శాతం పన్ను వర్తిస్తుంది. దీంతో జాతీయ జట్ల మ్యాచ్లను వీక్షించే అభిమానులకు ఊరట లభించినప్పటికీ, ఐపీఎల్ అభిమానులపై మాత్రం పన్ను భారం తప్పేలా లేదు.