TG | ఇందిరమ్మ ప్రభుత్వంపై మీ దీవెనలు ఉండాలి : మంత్రి పొంగులేటి

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ రేగొండ, జులై 21 (ఆంధ్రప్రభ) : రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం (Indiramma government) పై ప్రజల దీవెనలు ఉండాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. భూపాలపల్లి (Bhupalpalli) నియోజకవర్గంలోని నూతన మండలం గోరి కొత్తపల్లి మండలంలో సోమవారం రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu), స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు (Gandra Satya Narayana Rao) తో కలిసి పర్యటించారు. ముందుగా గోరి కొత్తపల్లికి చేరుకున్న మంత్రులకు ఎమ్మెల్యే జీఎస్ఆర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ పుష్పగుచ్చం ఇచ్చి ఘనస్వాగతం పలికారు.

ముందుగా పోలీసు గౌరవ వందనం స్వీకరించి అనంతరం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో నూతన పోలీస్ స్టేషన్ ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధరాబాబుతో కలిసి ప్రారంభించారు. నూతన పోలీస్ స్టేషన్ ఎస్ఐగా దివ్యశ్రీ బాధ్యతలు స్వీకరించగా, వారిని ఆశీర్వదించారు. అనంతరం స్థానిక హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన పబ్లిక్ మీటింగ్ లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. నూతన మండలానికి రావడంతో వర్షం పడటం శుభసూచకమన్నారు. స్థానిక ఎమ్మెల్యేను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించినట్లే రానున్న ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వానికి మీ దీవెలు ఉండాలని కోరారు.

అనంతరం ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ… గండ్ర సత్యనారాయణ రావు నియోజక వర్గ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్నారని ప్రతి పనిలో వారికి మంత్రులము పూర్తిగా సహకారం అందిస్తామని తెలిపారు. భారీగా వర్షం పడటంతో బహిరంగ సభను త్వరగానే ముగించారు. ఈకార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు, ట్రేడ్ ప్రమోషన్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply