సహజంగా లోకంలో బలవంతులు దుర్బలులను అణచివేయడం జరుగుతూ ఉంటుంది. దీనిని ‘మత్స్యన్యాయము’, అంటే చిన్న చేపలను పెద్ద చేపలు మ్రింగినట్లు అనీ, ‘అటవీ న్యాయం’ అంటే బలమైన జంతువులు అల్ప జీవులను వేటాడి చంపి తినినట్లు అనీ చెబుతూ ఉంటారు. ”చేతులు లేని వాటిని చేతులున్న ప్రాణులు చిన్న జీవులను పెద్ద జీవులు చిన్న చేపలను పెద్ద చేపలు లాగా బలహీనులను బలవంతులు హింసించి సంహరిస్తారు” అని మహాభారతంలో భీష్ముడు చెప్పి ఉన్నాడు. డార్విన్ సిద్ధాంతం కూడా అదే కదా! ఈ పరిస్థితి అమలు అవుతున్నంత కాలం ఈ లోకంలో సమన్యాయం ఎప్పటికీ జరగదు.
వయసులో చిన్నవాడు, బలహీనుడైన శిశువును పెద్ద పిల్లల నుండి తల్లి దండ్రులు సంరక్షించినట్లుగా, రాజు లేదా పరిపాలకుడు బలహీనులను సంరక్షించాలని చాణక్యుడు తన ‘అర్థశాస్త్రము’లో చెప్పాడు. వేటాడడం ద్వారా క్రూర మృగాలనుండీ, శిక్షించడం వలన దుర్మార్గులనుండీ బలహీనులను కాపాడడం రాజ ధర్మం అని అతని అభిప్రాయం. అయితే అనాదిగా చాలా సందర్భాలలో తల్లిదండ్రులు, పరిపాలకులే కాదు దైవం కూడా దుర్బలుల పట్ల వివక్ష చూపడం ‘కంచే చేను మేసిన చందము’గా సంభవిస్తూంటుంది అని క్రింది సంస్కృత శ్లోకం, దాని నేపథ్యం చెబుతున్నాయి. ”అశ్వంనైవ, గజంనైవ, వ్యాఘ్రం నైవచ నైవచ/అజా పుత్రం బలిం దద్యాత్, దేవో దుర్బల ఘాతుక:”…. తమ గ్రామంలో విస్తరించిన ఆధివ్యాధుల నుండి తమను రక్షించమని కోరుతూ గ్రామ దేవతను భక్తులు ఇలా మొక్కుకొన్నారట. ”అమ్మా ! మా గ్రామంలో వ్యాధులను పోగొడితే నీకు నచ్చిన జంతువును బలిగా సమర్పించికొంటాము. మంచి రయమున్న గుర్రాన్ని బలి ఇమ్మంటావా? అంటే ఆమె ‘గుర్రం నాకు వద్దు’ అని పలికిందట. ‘అయితే ఏనుగును తెచ్చి బలి ఇవ్వమా?’ అంటే ‘వద్దు. నాకు ఏనుగూ వద్దు’ అన్నదట. ‘పోనీ పెద్ద పులిని తెచ్చి బలి ఇవ్వమా’ అంటే వద్దు వద్దు పులి అసలే వద్దు’ అని పలికిందట. మరి ఏ జంతువును తెచ్చి బలి ఇవ్వమంటావు తల్లి? నీవే చెప్పు అంటే ‘నాకు మేక పిల్లను బలి ఇవ్వండి చాలు’ అని చెప్పిందట. కనుక దైవం కూడా (బలహీనప్రాణులైన మేకలు, కోళ్ళవంటి జీవులనే బలి కోరుతుంది కనుక) ‘దుర్బల ఘాతుకమే’ అని పై శ్లోక భావం. బలహీనులను దైవం కూడా రక్షింపలేదు కనుక స్వయం శక్తిని దుర్బలులు పెంపొందించు కోవాలి అని బోధించడానికే ఈ చాటు శ్లోకం రచింపబడిందే కానీ, నిజానికి ఏ దైవమూ జంతు బలిని కోరదు.
ఇలాంటిదే మరొక కల్పిత కథ కూడా జన బాహుళ్యంలో ప్రచారంలో ఉంది. ఒకమారు ఒక మేకపిల్ల సృష్టికర్త అయిన బ్రహ్మ దేవునితో ఇలా మొర పెట్టుకొందట ”స్వామీ ! మా జాతికి ఎంత అన్యాయం జరుగుతూ ఉందో గమనించారా? దేవతలకు బలి ఇవ్వాలన్నా, తాము మాంసాహారం తినాలను కొన్నా మానవులు మమ్మల్నే ఎంచుకొంటున్నారు. మాపై దయచూపి మాకు ఈ బాధ తప్పించండి”. అప్పుడు బ్రహ్మ మేక పిల్లను ఎగాదిగా చూచి, ”తక్షణం ఇక్కడి నుండి వెళ్ళిపో. ఆలస్యం చేశావంటే నిన్ను తినాలని నాకూ నోరు ఊరుతుంది”. ఇది కట్టు కథ అయినా బలహీనులకు దేవుడు కూడా న్యాయము చేయలేడు కనుక ఎవరికి వారే తమ స్వశక్తిని పెంపొందించుకొని, తమను తామే కాపాడుకోవాలనే నీతి ఇందులో ఉంది.
బలవంతులు తమ శక్తియుక్తులను లోకంలోని బలహీనుల, పేదల కోసం వినియోగిస్తే దైవ సమానులుగా కొని యాడబడతారు. అలా కాకుండా అమాయక, దుర్బల ప్రాణులను, వ్యక్తులను పీడించడానికి తమ బలాన్ని, పలుకుబడిని, ప్రాబల్యాన్ని ఉపయోగిస్తే లోక కంటకులైన రాక్షసులుగా, చరిత్రలో శాశ్వత లోక నిందకు గురి అవుతారు. ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్న అంశంలోనే మానవుల విజ్ఞత దాగి ఉంది. బలహీనుల రక్షణ వలననే సమతా భావం, సహజీవనం, సమధర్మం అనే ఆ దర్శాలు సాకారమవుతాయి.
—
- గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి.