ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు…

ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దు…

మొంథా తుఫాన్ తీవ్రత దృష్ట్యా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. మంగళవారం ఉదయానికి తుఫాన్ మరింత బలపడి, అదే రోజు రాత్రికి కళింగపట్నం-మచిలీపట్నం మధ్య, కాకినాడ సమీపాన తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.

దీంతో సోమవారం, ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్ర‌బాబు. ఈ సంద‌ర్భంగా ఆయన అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సీఎం మాట్లాడుతూ, “ప్రజల ప్రాణాలకు, ఆస్తికి సంబంధించిన రక్షణలో ఏ విధమైన అశ్రద్ధను సహించం. మానవ ప్రయత్నంలో ఏ చిన్న లోపం కూడా కనబడకూడదు” అని గట్టిగా హెచ్చరించారు.

తుఫాన్ తీవ్రత దృష్ట్యా ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని, ప్రతి అధికారి బాధ్యతగా విధులను నిర్వర్తించాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం ముఖ్యమని, ఆస్తి నష్టం జరగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రాలను వెంటనే సిద్ధం చేయాలని సూచించారు. తరలించిన ప్రతి కుటుంబానికి రూ.3,000 నగదు సహాయం, 25 కిలోల బియ్యంతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు అందించాలని తెలిపారు. పునరావాస కేంద్రాలలో నివసించే వారికి నాణ్యమైన భోజనం, త్రాగునీరు, వైద్య సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని పేర్కొన్నారు.

వైద్య బృందాలు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే మొబైల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని, త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మురుగునీటి పారుదల వ్యవస్థను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.

విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి, విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని చెప్పారు. వాలంటీర్లను కూడా రక్షణ చర్యలలో భాగస్వాములను చేయాలని ఆదేశించారు.

జిల్లాల పరిస్థితి..

జిల్లాల పరిస్థితులపై కలెక్టర్లతో మాట్లాడిన చంద్రబాబు, నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నప్పటికీ అన్ని రక్షణ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ వివరించారు. చెరువులు, కాలువలు ఎక్కడా తెగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆర్టీజీఎస్ (RTGS – రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్) ద్వారా అందుతున్న సమాచారాన్ని నిరంతరం పరిశీలించాలని సీఎం ఆదేశించారు.

విజయవాడ, మంగళగిరి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండవచ్చని హెచ్చరించి, తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. తుఫాన్ సమయంలో ఎవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ముగిసిన తరువాత పునరావాసం, పునర్నిర్మాణ పనులు వేగంగా చేపట్టాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలియజేశారు.

Leave a Reply