సతీవియోగం తర్వాత భార్యావిముఖుడైన శంకరుడు విరక్తి కలిగి ఘోర తపస్సు చేయనారభించెను. స తీదేవి పార్వతిగా మరో జన్మ ఎత్తగా ఆమెతోనే
శివునికి మరల వివాహం చేయదలచిన దేవతలు, ఋషులు, నారదుడు పార్వతిని శంకరునికి వద్దకు పంపెను. పార్వతి శంకరునికి సపర్యలు చేసినా ఆయన చలించలేదు. శంకరుడి దృష్టి పార్వతిపై మరల్చడానికి ఇంద్రుడు మన్మథుడిని పంపెను. మన్మథుడి పూలబాణంతో తపోభంగమైన శివుడు ఆగ్రహించి తన మూడో నేత్రమును తెరచి మన్మథుడిని భస్మం చేసెను.
మన్మథదహనం (కామదహనం) జరిగిన తర్వాత రతీదేవి భర్తకై విలపించి శంకరునిని ప్రార్ధించినపుడు శంకరుడు అనుగ్రహించి శరీరం
లేకుండా మన్మథుడిని మరల బ్రతికించాడు. ఈ విషయం మన్మథుని ప్రాణమిత్రుడైన వసంతునికి తెలిసి ఆనందంతో ప్రకృతి అంతా నిండాడు. అనగా చెట్లు చిగురించి పువ్వులు పూసి కాయలు కాసాయి. మన్మథుడు బ్రతికాడని ప్రకృతే రంగులు చల్లుకున్నది. ఈ రంగులను చూసిన వారి మనస్సు ఉప్పొంగి వారు కూడా రంగులను చల్లుకుంటున్నారు. ప్రియుడు (మన్మథుడు) మరలా బతికాడని తెలుసుకున్న హోళిక అను రాక్షసి (రతి) కూడా ఆనందంతో శరీరాన్ని రంగులమయం చేసుకుంది. ఆమె పేరు మీదే రంగుల పండుగ హోళీ అయింది. ప్రకృతి ఆనందిస్తే చెట్లు, చేమలు రంగులు పులుముకుంటాయి. మానవుడు ఆనందిస్తే అనురాగం, ఆప్యాయత, ఆహ్లాదం రంగులై పారతాయి. మన్మథుడు శరీరం లేకుండా బ్రతకడం అంటే నిజమైన ఆనందం శరీరంతో పొందేదికాదు ఆనందం అంతా ఆత్మదే అని అర్థం. ఆత్మకు శరీరం వస్త్రం మాత్రమే. ఈ పరమార్ధాన్ని, అంతరార్ధాన్ని లోకానికి అందించేది హోళీ. రంగులు చల్లుకోవడంలో మానవతను, దైవభావనము, సకల జనసౌభాగ్యాన్ని అందజేసిననాడు సమాజమంతా రంగులు వెల్లివిరుస్తాయి. శరీరాత్మ విజ్ఞాన్నాన్ని పెం చే పండుగే హోళీ.
-శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు..
వాయస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి