ప్రధాని చైనా పర్యటన వెనుక మర్మమేమిటి..?
శత్రువును జయించడమంటే చంపడం కాదు, ఓడించడం.. ఇది భారత్ వైఖరి. తనంతట తానుగా ఎవరితోనూ కయ్యానికి కాలు దువ్వకపోయినా, శత్రుత్వం పెట్టుకోకపోయినా తన జోలికొస్తే మాత్రం ధీటుగా సమాధానమిస్తుంది. ఇది పాక్ విషయంలో ప్రపంచానికి మరోసారి రుజువైంది. ఇప్పుడు టారిఫ్ లతో తనపై విరుచుకు పడుతున్న అమెరికాకు ధీటుగా సమాధానమివ్వడానికి భారత్ సమాయత్తమైంది. శత్రువు కంటే బలమైన శక్తులను దౌత్యంతో ఏకం చేసుకుని శత్రువును ఒంటరిని చేయడం, బలహీనపర్చడం యుద్దనీతి. దౌత్యరీతి. ఇప్పుడు అదే నీతితో భారత్ అడుగులేస్తోంది.
ట్రంప్ సుంకాల (Trump’s tariffs) బెదిరింపుల వేళ.. ప్రధాని మోదీ చైనా, జపాన్, రష్యా (China, Japan, Russia) పర్యటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రష్యాతో వాణిజ్యం చేస్తోన్న చైనా, భారత్లను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి, ఉక్రెయిన్తో యుద్ధానికి భారత్ ఆర్థిక సాయం చేస్తోందని అమెరికా అధ్యక్షుడు ఆరోపిస్తున్నాడు. తక్షణమే రష్యా (Russia) నుంచి ఆయిల్, ఆయుధాల దిగుమతులు నిలిపివేయకుంటే టారిఫ్ల శాతం మరింత పెంచుతానని భారత్పై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఈ సమయంలో అమెరికా పెద్దన్నకు చెక్ పెట్టాలని ప్రధాని మోదీ వరుసగా విదేశీ పర్యటనల (Foreign travel) కు సిద్ధమయ్యారు. ట్రంప్ ఆగడాలను ఎదుర్కోవాలంటే అగ్ర రాజ్యాలను ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని మోదీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పాక్పై అమెరికా (America) ఎక్కడా లేని ప్రేమను ఒలకబోస్తుండటం కూడా భవిష్యత్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే ప్రమాముందని మోదీ గ్రహించారు. ఈ నేపథ్యంలో చైనా, రష్యా, జపాన్ తదితర దేశాలతో సత్సంబంధాలు కొనసాగించి ట్రంప్కు చెక్ పెట్టాలని మోదీ ఐడియా. ఈ ముగ్గురు ఒకటైతే మాత్రం పెద్దన్నకు బొక్క తప్పదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
బహుళ సంబంధాలు నెలకొల్పడంలో మోడీయే కీలకం..
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) భారత్పై రష్యా చమురు దిగుమతులపై అదనపు సుంకాలు విధించనున్నట్టు హెచ్చరించిన నేపథ్యంలో, భారత ప్రభుత్వం అంతర్జాతీయ వేదికల్లో సక్రమంగా వ్యూహాత్మక బహుళ సంబంధాలు నెలకొల్పడంలో మోదీ పాత్ర కీలకమని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పర్యటన భారత విదేశీ విధానంలో ఒక కీలక మలుపుగా భావిస్తుండగా, చైనా-భారత్ (China-India) మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రెండు పక్కల సంభాషణను కొనసాగించడం ద్వారా స్ధిరత్వాన్ని సృష్టించడానికి దీని ప్రయోజనాలు ఉండవచ్చని అంటున్నారు.
ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటన..
దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రధాని మోదీ (Prime Minister Modi) చైనాలో పర్యటించనున్నారు. ఈ నెల 31 నుంచి రెండు రోజుల పాటు ఆయన చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఎస్సీవో సదస్సుకు రావాలని చైనా మోదీని ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు ప్రధాని ఆ దేశంలో పర్యటించనున్నారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారీఫ్లు పెంచిన నేపథ్యంలో మోదీ చైనా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా గాల్వాన్ ఘటన తర్వాత ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. 2019లో జరిగిన ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చివరి సారి చైనాలో పర్యటించారు. ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో భారత్ – చైనా (India – China) తమ ఆర్థిక సంబంధాలను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయవచ్చు.
చైనా పర్యటనకు ముందుకు జపాన్కు…
చైనా పర్యటనకు ముందు మోదీ జపాన్ (Japan) లో పర్యటించనున్నారు. ఆగస్టు 30న జపాన్ను సందర్శించనున్నారు. అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అక్కడి నుండి ఆయన చైనాకు వెళతారు. ప్రధాని టూర్కు ముందు.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) రష్యా పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం మాస్కోలో సీనియర్ రష్యన్ అధికారులతో అజిత్ దోవల్ సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో భారత్-రష్యా రక్షణ, భద్రతా సహకారం, చమురు ఆంక్షలు, రాబోయే మోడీ-పుతిన్ శిఖరాగ్ర భేటీ వంటి అంశాలపై చర్చించనున్నారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని భారత చర్యలతో అర్థమవుతోంది.
పాక్, అమెరికా దోస్త్ మేరా దోస్త్…
మరోవైపు, పాకిస్థాన్ (Pakistan) తో వాణిజ్య ఒప్పందం చేసుకున్న ట్రంప్.. దాయాదిపై ఎక్కడలేని ప్రేమను ఒలకబోస్తున్నారు. పలు దేశాలపై ప్రతీకార సుంకాలు భారీగా పెంచినా.. పాక్కు మాత్రం తగ్గించారు. గత దశాబ్దకాలంలో ఎన్నడూలేని విధంగా పాక్తో అమెరికా (America) అంటకాగుతుండటం యావత్తు ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తోంది. అయితే, దీని వెనుక భారత్పై ఒత్తిడి పెంచే వ్యూహం ఉందనేది మాత్రం స్పష్టమవుతోంది. అంతేకాదు, స్వీయ ప్రయోజనాల కోసం అమెరికా ఎంతకైనా తెగిస్తుందనడానికి పాకిస్థాన్తో చెట్టపట్టాలేసుకోవడమే ఉదాహరణ.
భారత్పై అమెరికా 50 శాతం టారిఫ్లు
భారత్పై మరోసారి ట్రంప్ పిడుగు పడింది. ఇప్పటికే భారత్పై 25 శాతం టారిఫ్లు విధించిన ట్రంప్.. తాజాగా మరో 25 శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మొత్తంగా భారత్పై అమెరికా 50శాతం టారిఫ్లు విధించినట్లయింది. అయితే రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు చేయడం వల్లే ఈ అదనపు 25 శాతం పెనాల్టీ పన్నులు విధిస్తున్నట్లు ట్రంప్ (Trump) వెల్లడించడం గమనార్హం. ట్రంప్ తాజా నిర్ణయంతో భారత్ ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడింది. భారత్-రష్యా స్నేహాన్ని, వాణిజ్యాన్ని దెబ్బకొట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలకు తెరలేపుతున్నారు. ఇటీవల ఆగస్ట్ 1వ తేదీన ప్రపంచ దేశాలపై విధించే టారిఫ్ ల (tariffs) శాతాన్ని వెల్లడించిన ట్రంప్.. భారత్పై 25 శాతం పన్నులు (25 percent taxes) విధించనున్నట్లు వెల్లడించారు. అయితే రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ట్రంప్.. భారత్పై టారిఫ్ బాంబ్ వేశారు. అయినప్పటికీ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ ఆపకపోవడంతో ట్రంప్ మరింత గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో బాంబ్ పేల్చారు. భారత్పై మరోసారి 25 శాతం పన్నులను విధిస్తూ నిర్ణయం తీసుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు (US president) మరో సంచలన ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే 25 శాతం టారిఫ్లతో సతమతం అవుతున్న భారత్కు.. తాజా 25 శాతం టారిఫ్లు మోయలేని భారంగా మారతాయని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో భారత్పై ట్రంప్ 50 శాతం టారిఫ్లు వేసినట్లయింది.