24 గంటలు అప్రమత్తంగా ఉండాలి
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫానుతో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి (Collector Chadalawada Nagarani) సూచించారు. మొంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమును జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సోమవారం పరిశీలించి కంట్రోల్ రూమ్ కు ప్రజల నుండి వచ్చిన కాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న దృష్ట్యా కంట్రోల్ రూమ్ (Control room) సిబ్బంది అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, మండల కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డివిజనల్, మండల స్థాయి కంట్రోల్ రూమ్ ల నుండి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

పల్లపు ప్రాంతాలు ముంపునకు గురి కావడం, చెట్లు పడిపోవడం, నిత్యవసర వస్తువుల కొరత, విద్యుత్ అంతరాయాలు, పునరావాస కేంద్రాల వద్ద త్రాగునీరు, శానిటేషన్ (Sanitation), వైద్య సహాయం తదితర సమస్యల పై ఫిర్యాదులు వస్తే తక్షణమే స్పందించి సంబంధిత సమాచారాన్ని ప్రత్యేక అధికారుల దృష్టికి తీసుకు వెళ్లాలన్నారు. తుఫాను తీరం దాటి పరిస్థితులు చక్కబడే వరకు 24 గంటలు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డిఆర్ఓ బి.శివనారాయణ రెడ్డి, గ్రామ వార్డు సచివాలయ అధికారి వై.దోసిరెడ్డి తదితరులు ఉన్నారు.

