జగిత్యాల, (ఆంధ్రప్రభ) : వేధింపులకు తాము భయపడేది లేదని నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని నవదుర్గ ఆలయం రెండో వార్షికోత్సవం సందర్భంగా స్థానిక మహిళలతో కలిసి కుంకుమ పూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవితకు ఆలయ అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు.
ఈసందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సహా తమ నేతలపై ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతుందని, ఇలాంటి వేధింపులకు తాము భయపడబోమని, ధైర్యంగా అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటామన్నారు. వానాకాలం పంట సీజన్ మొదలైందని, రైతులు రైతు భరోసా సాయం కోసం ఎదురు చూస్తున్నార్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చిందని, అది కూడా 60శాతం మంది రైతులకే ఇచ్చిందని, మిగిలిన 40శాతం మందికి ఎప్పుడు రైతు భరోసా ఇస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.
నిరుడు యాసంగిలో ఇచ్చినట్టు మూడు ఎకరాల భూమి ఉన్న రైతులకే భరోసా ఇస్తారా.. లేదా రైతులందరికీ వర్తింపజేస్తారా.. అనే దానిపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతులకు, ప్రజలకు ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. రైతు భరోసా సహా అన్ని హామీలను నెరవేర్చకుండా ఇచ్చిన మాట తప్పిందన్నారు. కనీసం వృద్ధులకు ఇచ్చే పింఛన్లు కూడా పెంచిన పాపాన పోలేదని, మహిళలకు రూ.2,500 ఇవ్వలేదని.. ఇలా అన్ని హామీలను కాంగ్రెస్ ఎగవేసిందన్నారు. హామీల అమలుపై, సర్కారు చేస్తోన్న అక్రమాలపై ప్రశ్నిస్తున్నామని, తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్, హరీశ్ రావు (Harish Rao) లకు నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందన్నారు. ఇటీవలే కాళేశ్వరం (Kaleswaram) కమిషన్ పేరుతో కేసీఆర్ ను విచారించగా, తాజాగా కేటీఆర్ ను సైతం ఏసీబీ విచారిస్తోందన్నారు.
తాయు వేధింపులకు భయపడే వారం కాదని, కేటీఆర్ విచారణకు హాజరయ్యారన్నారు. కేటీఆర్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమని, తమ కార్యకర్తలు, నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. తమ పార్టీ లోపాలను సవరించుకుంటామని, తమ మీద ఎవరైనా దాడికి వస్తే కలిసికట్టుగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాగా, తమ పార్టీ ఎంపీ దామోదర్ రావు ఎంపీ లాడ్స్ నుంచి రూ.90 లక్షలు నవదుర్గ ఆలయ (Navadurga Temple) అభివృద్ధి కోసం ఇచ్చారన్నారు. అలాగే జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ మరో రూ.10 లక్షలు ఇచ్చారన్నారు.