ఇస్లామాబాద్ – ఆంధ్రప్రభ : సింధూ నదీ జలాలను అడ్డుకుంటే భారత్పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ హెచ్చరించారు. పూర్తిస్థాయి యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. పాక్ అణ్వాయుధాలు జనాలకు ప్రదర్శించడం కోసం కాదని అన్నారు. పాక్లో ఎవ్వరికీ తెలియని ప్రాంతాల్లో వాటిని దాచి ఉంచామని, అవసరమైతే ప్రయోగిస్తామని అన్నారు. ‘‘వాళ్లు నీటి సరఫరాను నిలిపేస్తే యుద్ధానికి సిద్ధం కావాలి. మా మిలిటరీ సామగ్రి, ఆయుధాలను ప్రదర్శన కోసం పెట్టుకోలేదు. మా అణ్వాయుధాలు ఏయే ప్రాంతాల్లో దాచామో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మరోసారి చెబుతున్నా.. ఈ మిసైల్స్ను మీపై గురిపెట్టి సిద్ధంగా ఉంచాం’’ అంటూ నోటికొచ్చినట్టు పాక్ మంత్రి రెచ్చిపోయారు.
భారత్కే తీవ్ర నష్టమంటూ కూతలు..
పహల్గాం దాడి తర్వాత భారత్ పాక్పై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. దాయాది దేశంతో అన్ని రకాల దౌత్య, వాణిజ్య బంధాలను తెంచుకోవడంతో పాటు పాక్ నీటి భద్రతకు కీలకమైన 1960ల నాటి సింధూ నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని కూడా నిలుపుదల చేసింది. ఈ పరిణామాలపై పాక్ మంత్రి అబ్బాసీ మాట్లాడుతూ.. పాక్ గగనతలాన్ని మూసేయడంతో భారత వైమానిక రంగంలో కలకలం రేగిందన్నారు. కేవలం రెండు రోజులకే భారత్ ఇరకాటంలో పడిందని చవకబారు కూతలు కూశారు. ‘‘పరిస్థితి మరో 10రోజుల పాటు ఇలాగే కొనసాగితే భారతీయ ఎయిర్లైన్స్ దివాలా తీస్తాయి’’ అని పాక్ మంత్రి అన్నారు.
అందుకే ఉగ్రవాదాన్ని పెంచాం..
భారత్ తన భద్రతా వైఫల్యాన్ని అంగీకరించకుండా పహల్గాం దాడి నెపాన్ని పాక్పై నెడుతోందని పాకహ మంత్రి ఈ సందర్భంగా విమర్శించారు. భారత్తో వాణిజ్య నిలుపుదలతో ఏర్పడే పరిణామాలకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పాశ్చాత్య దేశాల కోసమే తాము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాల్సి వస్తోందని అంతకు ఒక రోజు ముందే పాక్ ప్రధాని అంగీకరించిన తర్వాత అబ్బాసీ ఈ ప్రకటన చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది.