AP | కోడ్​ ఉల్లంఘన… వైఎస్​ జగన్​పై కేసు

  • మరో ఏడుగురిపై కూడా కేసు నమోదు..
  • ఇంకా కొందరిని గుర్తించే పనిలో పోలీసులు


ఉమ్మడి గుంటూరు, ఆంధ్రప్రభ బ్యూరో : వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల సంఘం అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు ఆ పార్టీ నేతలు, మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, మాజీ మంత్రి, ప్రస్తుత గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడులను ఈ కేసులో నిందితులుగా చేర్చారు.

కోడ్​ ఉల్లంఘన ..
గుంటూరు జిల్లాలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా జగన్‌ ఈసీ నుంచి అనుమతి తీసుకోకుండానే బుధవారం గుంటూరు మిర్చియార్డులో పర్యటించారు. ఎన్నికల కోడ్‌తో పాటు, పోలీసు యాక్ట్‌ ప్రకారం విధించిన నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించారు. దీనిపై కేసు నమోదు చేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారి సీహెచ్‌ శ్రీనివాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.

ట్రాఫిక్​కు అంతరాయం ..
జగన్‌ నేతలతో కలిసి గుంపుగా యార్డులోకి ప్రవేశించారని యార్డు కార్యదర్శి అనుమతైనా తీసుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, మిర్చిలోడుతో వచ్చిన రైతులకు అసౌకర్యం, ఆటంకం కలిగించినట్లు గుర్తించామని, మిర్చియార్డు ఎదుట రోడ్డుపై పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, అనుచరులు చేరడం వల్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారని వివరించారు.

అనుమతి లేకుండానే…
ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండా అనుచరులతో వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు నల్లపాడు పోలీసులు మాజీ సీఎం జగన్‌తో పాటు మరో ఏడుగురు నేతలపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారిని గుర్తించి కేసులో చేర్చే అవకాశముందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *