కరీంనగర్ : టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కరీంనగర్ (Karimnagar) అంబేద్కర్ స్టేడియంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) శ్రీకారం చుట్టారు. మొత్తం 20వేల సైకిళ్లను స్వంత నిధులతో కొనుగోలు చేసిన బండి వాటిని దశల వారీగా పంపణీ చేసే కార్యక్రమాన్ని నేడు చేపట్టారు. తొలుత కరీంనగర్ టౌన్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ సైకిళ్ల (Bicycle) ను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి బండి సంజయ్ తో పాటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ అశ్వినీ, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజీపీ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ మేయర్లు, డి.శంకర్, సునీల్ రావు, మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్, ఆర్డీవో, డీఈవోతోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ… ఈ సైకిళ్ల పంపిణీ ఆలోచన ఇచ్చిందే జిల్లా కలెక్టర్ అని అన్నారు. బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో బాలికలకు సైకిళ్లు ఇస్తే బాగుంటుందని కలెక్టర్ (Collector) ప్రతిపాదించారని చెప్పారు. ఆ ఆలోచనతోనే ఈరోజు టెన్త్ విద్యార్ధినీ, విద్యార్థులందరికీ సైకిళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇవి ప్రభుత్వ నిధులు కావని, అలాగే తాను కోట్లు ఖర్చు పెట్టేంత సంపన్నుడిని కాదని అంటూ తన దగ్గరకు వచ్చిన కొందరు కార్పొరేట్ కంపెనీల యాజమానులను మీరు సంపాదించిన సొమ్ములో కొంత సీఎస్సార్ ఫండ్ కింద ఇవ్వాలని కోరితే వారు సానుకూలంగా స్పందించి ఆ నిధులు అందిస్తే వాటితో సైకిళ్లను కొని మీకు పంపిణీ చేస్తున్నానని చెప్పారు.
త్వరలో మోడీ గిఫ్ట్స్…
అతిత్వరలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు అతి త్వరలో ‘‘మోదీ కిట్స్’’ను అందజేయబోతున్నామని బండి చెప్పారు.. ఎన్ని వేల మంది ఉన్నా, ఎన్ని లక్షల మంది ఉన్నా వాళ్లందరికీ మోదీ కిట్స్ ను అందిస్తామని పేర్కొన్నారు.. తల్లిదండ్రులు ఎంతో పేదరికంలో ఉంటూ మిమ్ముల్ని కష్టపడి చదివిస్తున్నారని, భవిష్యత్తులు ఉన్నత స్థానంలోకి రావాలని కలలు కంటున్నారన్నారు.. వారి శ్రమను ద్రుష్టిలో ఉంచుకుని తలదించుకుని చదవాలని, బాగా చదివి తల ఎత్తుకు తిరిగేలా బతకాలని విద్యార్ధులను కోరారు.