నంద్యాల బ్యూరో, మే 6 (ఆంధ్రప్రభ ) : నంద్యాల జిల్లాలో మంగళవారం మట్టి మిద్దె కూలి ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ తాలూకాలోని పాంపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం తిరుపాల్ అనే వ్యక్తి మట్టిమిద్దె పైకి ఎక్కి కప్పు ఊడదీస్తుండగా ప్రమాదవశాత్తు పైకప్పు మొత్తం కూలిపోయింది. అందులో నలుగురు వ్యక్తులు ఉన్నారు.
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతిచెందిన వారిలో పాంపల్లె గ్రామానికి చెందిన నారాయణ, ఎస్.లింగందిన్నె గ్రామానికి చెందిన యోబులు ఉన్నారు. మరో ఇద్దరు తిరుపాలు, సుబ్బారావుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఈ సంఘటన జరగటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. బంధువుల రోధనలు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు డిఎస్పి తెలిపారు.