- నేడు వైజాగ్లో మూడో వన్డే
- సౌతాఫ్రికా, టీమిండియా ఢీ
- నిర్ణయాత్మక పోరులో గెలుపెవరిదో?
- మ్యాచ్ మధ్యాహ్నం 1.30గంటలకు..
Cricket | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇప్పటికే దక్షిణాఫ్రికాతో టీమిండియా టెస్ట్ సిరీస్ కోల్పోయింది. వన్డే సిరీస్ అయినా దక్కుతుందా లేదా అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మూడు మ్యాచ్ ల సిరీస్లో ఇప్పటికి రెండు మ్యాచ్ లు అయ్యాయి. వీటిల్లో మొదటిది టీమ్ ఇండియా గెలవగా..రెండో మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలిచింది. ఈరోజు మూడో మ్యాచ్ వైజాగ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారే సిరీస్ విజేత అవుతారు. దీంతో ఇరు జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం. టీమ్ ఇండియాకు ఇది మరీ ముఖ్యమైన మ్యాచ్. టెస్టులలో ఓడిపోయి పరువు పోగొట్టుకున్న భారత జట్టు వన్డేల్లో అయినా గెలిచితీరాలని పట్టుదలగా ఉంది. పైగా ఇందులో సీనియర్లు కూడా ఆడుతున్నారు. మొదటి రెండు మ్యాచ్ లు జరిగిన తీరు చూశాక మూడో మ్యాచ్ కూడా హోరాహోరీగా సాగనుందని తెలుస్తోంది.

బ్యాటింగ్ ఓకే..
వన్డేల్లో టీమ్ ఇండియా మెరుగైన ప్రదర్శన చేస్తోంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఉండడం అదనపు బలంగా ఉంది. మొదటి రెండు మ్యాచ్ లలో కోహ్లీ సెంచరీలు చేశాడు. రోహిత్ శర్మ ఒకదానిలో హాఫ్ సెంచరీ చేశాడు. దానికి తోడు కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రాణిస్తున్నాడు. అలాగే రెండో వన్డేలో రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీ చేశాడు. బ్యాటింగ్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ ఒక్కడే పెద్ద ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. దీంతో బ్యాటింగ్ విషయంలో భారత్ ధీమాగానే ఉంది. పైగా వైజాగ్ స్టేడియం కోహ్లీకి బాగా కలిసి వచ్చే మైదానం. ఇక్కడ అతనికి మంచి రికార్డే ఉంది.

బౌలింగ్ ఆందోళనకరం
భారత బౌలింగ్ ను చూస్తే ఆందోళన కలిగిస్తోంది. ప్రధాన పేసర్లు లేకపోవడం జట్టును దెబ్బ తీస్తోంది. ప్రస్తుతం ఉన్న పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరూ పరుగులు భారీగా ఇచ్చేస్తున్నారు. అర్ష్దీప్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్లతో కూడిన పేస్ త్రయం ఈ మూడో మ్యాచ్ లో అయినా రాణిస్తుందేమో చూడాలి. అలాగే వైజాగ్ పిచ్ స్పిన్ కు అనుకూలిస్తుంది. దీన్ని కుల్దీప్, జడేజా, సుందర్ల త్రయం ఏమేరకు ఉపయోగించుకుంటుందన్నది తెలియాల్సి ఉంది. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న సఫారీలను కట్టడి చేయకపోతే మ్యాచ్ నెగ్గడం కష్టమే. అలాగే టీమిండియా ఫీల్డింగ్ చెత్తగా ఉంది. ఈ కారణంగానే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. దీనిని అధిగమించాలి.
ఫుల్ కాన్ఫిడెన్స్ లో సఫారీలు..
ఇక మరోవైపు తొలి వన్డేలో పోరాడి ఓడాక, ఆ స్ఫూర్తితో రెండో వన్డేలో విజయం సాధించిన దక్షిణాఫ్రికా.. ఎంతో ఉత్సాహంగా చివరి వన్డేకు సిద్ధమైంది. ఇప్పటికే టెస్ట్ సీరీస్ విజయం సాధించి ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉంది సఫారీ టీమ్. ఇప్పుడు ఇది కూడా గెలిచేస్తే ఆ జట్టు చరిత్రలోనే ఇది చెప్పుకోదగ్గ టూర్ అవుతుంది. భారత్పై పైచేయి సాధించి ఈ పర్యటనను చిరస్మరణీయం చేసుకోవాలని సఫారీ జట్టు చూస్తోంది. బ్యాటింగ్లో మార్క్రమ్ జోరందుకోవడం.. బ్రీజ్కే, బ్రెవిస్లతో పాటు ఆల్రౌండర్లు బోష్, యాన్సెన్ బ్యాటుతో సత్తా చాటుతుండటం ఆ జట్టుకు సానుకూలాంశం. కెప్టెన్ బవుమా కూడా ఊపుమీదున్నాడు. ఇక బౌలర్లు కూడా కట్టుదిట్టంగానే బౌలింగ్ చేస్తున్నారు.
పిచ్ ఎలా ఉందంటే..
వైజాగ్ స్టేడియం విషయానికి వస్తే ఇది బ్యాటంగ్ కు అనుకూలించే పిచ్. ఇక్కడ జరిగిన పది వన్డేల్లో రెండుసార్లు 350కి పైగా స్కోర్లు నమోదయ్యాయి. ఒక్క ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లోనే టీమ్ ఇండియా 117 పరుగులకు కుప్పకూలిపోయింది. కానీ ఓవరాల్ గా చూస్తే వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. అలాగే ఇక్కడ స్పిన్నర్లు బాగా ప్రభావం చూపిస్తారు. మంచు ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశముంది.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్/నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్, క్వింటన్ డికాక్, టెంబాబవుమా (కెప్టెన్), ర్యాన్ రికిల్టన్, మాథ్యూబ్రీజ్కే, డివాల్డ్ బ్రెవిస్, మార్కోయాన్సెన్, కార్బిన్ బోష్, కేశవ్ మహరాజ్, లుంగిఎంగిడి, బార్ట్మన్.

