Tirumala | వైభవంగా ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

తిరుమల : తిరుమల శ్రీ‌వారి ఆల‌యం వెనుక వైపు గల వసంతోత్సవ మండపంలో గత మూడురోజుల పాటు అంగరంగ వైభవంగా జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు శనివారం కన్నులపండుగగా ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయ దేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా, చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో పాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి వారు , శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం నేత్రపర్వంగా సాగింది.

మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు. ఒకే వేదికపై సమస్త మూలవరులను దర్శించిన భక్తులు తన్మయత్వం తో పులకించారు. అదేవిధంగా ప్రతినెలా పౌర్ణమినాడు తిరుమలలో నిర్వహించే గరుడసేవను వార్షిక వసంతోత్సవాల కారణంగా టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *