కడప : ఒంటిమిట్టలో రమణీయంగా కోదండరామయ్య వార్షిక బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి.. ఐదవ రోజు ఉదయం మోహిని అలంకారంలో సీతారామ లక్ష్మణులు విహరించారు.. స్వామి అమ్మవార్లకు పుష్ప మాలికలు, స్వర్ణాభరణాలతో అలంకరించారు పండితులు.. మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో కోలాహలంగా జగదభి రామయ్య వాహన సేవ నిర్వహించారు.. భక్తులు అడుగడుగునా స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు.
పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.. అయితే, రేపు ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణోత్సవం జరగనుంది.. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 9:30 మధ్య పండు వెన్నెలలో పౌర్ణమి రోజున రాముల వారి కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు.. సీతారాముల కల్యాణోత్సవానికి సర్వం సిద్ధం చేసింది టీటీడీ.. భక్తులకు పంపిణీ చేయడానికి లక్ష ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్లు సిద్ధం చేశారు..
ఇక, రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడపకు రానున్నారు.. రేపు ఒంటిమిట్ట కోదండ రామాలయం కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు ఏపీ సీఎం.. ప్రభుత్వం తరఫున రాములవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.. రాత్రికి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్ లో బస చేయనున్నారు సీఎం చంద్రబాబు.. 12వ తేదీన తిరిగి కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు..
కాగా, ఒంటిమిట్ట శ్రీ కోదండ రాముని బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి.. రెండవ అయోధ్యగా పేరుగాంచిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ రామనవమి, హనుమత్సేవ, ఈ రోజు గరుడసేవ, రేపు సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం అత్యంత వైభవంగా జరుగనుంది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబ్రాలను స్వామివారికి సమర్పించనున్నారు. అనంతరం గజ వాహన సేవ నిర్వహించనున్నారు. ఏప్రిల్ 12వ తేదీన రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14వ తేదీన ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. అలాగే, ఏప్రిల్ 15న సాయంత్రం 5.30 నుంచి రాత్రి 9 గంటల వరకు పుష్పయాగం వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది.