- రిస్క్ చేయలేమని చేతులెత్తేసిన రెస్క్యూ సిబ్బంది
- లభించని ఏడుగురి ఆచూకీ
- తట్టబుట్ట సర్దుకుంటున్న సహాయక సిబ్బంది
- రెస్క్యూ ఆపరేషన్ జరగాల్సిందేనని సీఎం ఆదేశం
అచ్చంపేట, హైదరాబాద్, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంటలోని శ్రీశైలం ఎడమకాలువ గట్టు ఎస్ఎల్బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ లో ఊగిసలాటకు సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ వేశారు. అసెంబ్లీలో సాయంత్రం సహాయక చర్యలపై పవర్ పాయింట్ ప్రజెంటెషన్ను అధికారులు సభ్యులకు చూపించారు. అనంతరం సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగించారు. అలాగే టన్నెల్ వద్ద లోపలకు వెళ్లకుండా గోడ నిర్మాణానికి సిద్ధపడగా.. రెస్క్యూ బృందాలు కూడా తట్టబుట్ట సర్ధుకుని రెడీ అయ్యారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ చేయలేమని చేతులెత్తేశారు. ఒకవేళ చేస్తే రెస్క్యూ సిబ్బంది ప్రాణాలకు ముప్పు వాటిల్లనుందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో సహాయక చర్యలు నిలిపివేసే అవకాశాలు ఉన్నట్లు అందరూ నిర్ధారించుకున్నారు. ఇంతలోనే ఈ సమీక్ష సమావేశం అనంతరం అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. రెస్క్యూ ఆపరేషన్ ను కొనసాగించాల్సిందేనని, ఏడుగురి మృతదేహాలకు అన్వేషణ కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు.
నిరంతర పర్యవేక్షణకు ఐఏఎస్ అధికారి…
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనలో సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఇప్పటివరకు జరిగిన సహాయక చర్యల్లో పురోగతిని ముఖ్యమంత్రి సహచర మంత్రివర్గ సభ్యులు ఇతర ఉన్నతాధికారుల సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను వివరించారు. నిపుణుల కమిటీ సూచనలను తీసుకుంటూ కేంద్రం నుంచి అవసరమైన అనుమతులు తీసుకుని రెస్క్యూ ఆపరేషన్లో ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నెల రోజుల రెస్క్యూ ఆపరేషన్ లో…
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ నెల రోజులకు చేరుకుంది. రెస్క్యూ ఆపరేషన్లో ఎరక్టర్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహం మాత్రమే లభ్యం కాగా, మిగతా ఏడుగురు ఆచూకీ లభించలేదు. వీరి ఆచూకీ కోసం నెల రోజులపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, హైడ్రా, రోబోటిక్ ఇంజనర్లతో పాటు ఆర్మీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
35 మీటర్ల దూరంలో శిథిలాలు…
రెస్క్యూ ఆపరేషన్లో ఆదివారం చివరి 35 మీటర్ల దూరంలో సొరంగంలో పేరుకుపోయిన భారీ శిథిలాలు, మట్టి, పెద్ద పెద్ద బండరాళ్లను 4 జేసీబీలతో తొలగిస్తూ, మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరిలిస్తూ, కత్తిరించిన టీబీఎం అవశేషాలను లోకో ద్వారా సొరంగం ముఖఃద్వారం వద్దకు బయటకి పంపిస్తూ దుర్ఘటన చోటు చేసుకున్న చివరి 40మీటర్ల దూరం వరకు రెస్క్యూ బృందాలు అతికష్టం మీద చేరుకున్నాయి. అయినా సరే ఏడుగురి ఆచూకీ కానీ, వారి వస్తువులు, ఆనవాళ్లు కానీ లభించలేదు. ఒకవేళ వారు మరణించినట్లయితే వారి ఎముకలు, ఆనవాళ్లు కూడా దొరకలేదు.
చేతులెత్తేసిన రెస్క్యూ బృందాలు…
సొరంగంలో చివరి 35మీటర్ల దూరానికి చేరుకున్న రెస్క్యూ బృందాలకు 5మీటర్ల దూరంలో టీబీఎం చివరి బిట్ మీద భారీగా కొండ చరియలు పూర్తిగా ఆవహించుకొని పోవడం, వాటిని తొలగిస్తే పైనుండి కొండచరియలు మరింత పడి పూడుకుపోయి రెస్క్యూ టీమ్ సభ్యులను కూడా కప్పేసే ప్రమాదం వుండడం, మట్టిని తొలగించే కొద్ది భారీగా వస్తున్న నీటి ఉధృతి కూడా సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తుండడంతో రెస్క్యూ బృంద సభ్యులు చేతులెత్తాశారు.