Machilipatnam | ప్రజల చిరకాల కోరిక

Machilipatnam | ప్రజల చిరకాల కోరిక

ఆరు నెలల్లో గుడివాడ ఆర్ఓబి నిర్మాణం పూర్తి
రైల్వే గేట్లపై ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను పరిశీలించిన..
ఎంపీ బాలసౌరి, ఎమ్మెల్యే రాము

Machilipatnam, గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే గేట్ల పై ఫ్లై ఓవర్ (flyover) నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలసౌరి తెలిపారు. ఆరు నెలల్లో ప్లే ఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ఆయన ప్రకటించారు. గుడివాడ పట్టణంలో నిర్మితమవుతున్న ఆర్ఓబి నిర్మాణ పనులను ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ హెచ్ అధికారులు ప్లే ఓవర్ నిర్మాణ పనుల పురోగతిని వివరించారు. అనంతరం పలు అంశాల పై అధికారులతో ఎంపీ మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎంపీ బాలసౌరి (MP Balasouri) మీడియాతో మాట్లాడుతూ… గుడివాడ ప్రజల చిరకాల కోరిక అయిన ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు 70% పూర్తయినట్లు చెప్పారు. ఎప్పటికప్పుడు నిర్మాణ పనుల నాణ్యతను ఎమ్మెల్యే రాము పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. అధికారులు తెలిపిన చిన్న పాటి సాంకేతిక సమస్యలు 15 రోజుల్లో పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా గుడివాడ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నానని ఎంపీ బాలసౌరి పేర్కొన్నారు. గుడివాడ పట్టణంలోని మెయిన్ రోడ్డు నిర్మాణానికి 20 కోట్లతో ప్రతిపాదనలు పంపామని అవి త్వరలో ఆమోదం పొందనున్నట్లు ఎంపీ చెప్పారు.

గుడివాడ (Gudivada) అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న ఎంపీ బాలసౌరికి ప్రజల తరుపున ఎమ్మెల్యే రాము ధన్యవాదాలు తెలిపారు. ఆయన శ్రమ ఫలితంగానే గుడివాడలో అనేక కేంద్ర ప్రాజెక్టులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. త్వరలో మరిన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాలుస్తాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ముందుగా ఎంపీ బాల సౌరికి, ఎమ్మెల్యే రాముకు కూటమి నాయకత్వం ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు (Ravi Venkateswara Rao) గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణ మజ్జి శ్రీనివాస్, టీడీపీ నాయకులు చేకూరు జగన్ మోహన్ రావు, నిమ్మగడ్డ సత్యసాయి, యార్లగడ్డ సుధారాణి, జనసేన నాయకులు సాయన రాజేష్, వేమూరి త్రినాథ్, సందు పవన్, పంచకర్ల అమర్, అర్జా మోనాలిసా, ఎన్ హెచ్ డి.ఈ సత్యనారాయణ, ఏఈ శరత్ చంద్ర, వల్లభనేని కన్స్ట్రక్షన్ ఎండి వల్లభనేని వెంకటేశ్వరరావు, మావ్య సంస్థ ప్రతినిధులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply