శాయంపేట, ఏప్రిల్ 4( ఆంధ్రప్రభ): రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యమని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి రాహుల్ గాంధీ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ నినాదానికి పిలుపునిచ్చినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని గట్లకానిపర్తి గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని గ్రామంలోని రైస్ మిల్లు నుండి అంబేద్కర్ కూడలి వరకు పాదయాత్రగా చేరుకున్నారు. అనంతరం అక్కడ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువలపై ప్రజల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. నేడు పేద, బలహీన వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని, ప్రధానికి పేద ప్రజల కంటే బడాబాబులు ముఖ్యమన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేడ్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథమన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అనగదొక్కాలని చూస్తుందన్నారు. అమిత్ షా అంబెడ్కర్ ను పార్లమెంట్ సాక్షిగా అవమానించారన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు…
సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ఎమ్మెల్యే జీఎస్సార్ అన్నారు. గట్లకానిపర్తి గ్రామంలో ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి భూమిపూజ, శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఒకటి ఇందిరమ్మ ఇండ్లు అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల ద్వారా రూ.5 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హులైన ప్రతి ఒక్కరూ పథకం ఉపయోగించుకోవాలని అన్నారు. గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగిందన్నారు. గత పదేళ్ల నుండి నిరుపేదలకు గత ప్రభుత్వం ఇళ్లను ఇవ్వకుండా మోసం చేసిందని ఎమ్మెల్యే ఆరోపించారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.
