దేశవ్యాప్తంగా కోట్లాది మంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ప్రజలకు ఔషధాలను మరింత చవకగా, అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ (NPPA) దేశంలో ప్రసిద్ధి గాంచిన ఫార్మాస్యూటికల్ కంపెనీలు విక్రయిస్తున్న 35 మందుల రిటైల్ ధరలను తగ్గించింది.
ఈ కొత్త నిర్ణయం ద్వారా ఒంటినొప్పులు, గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల చికిత్సకు ఉపయోగించే మందుల ధరలు భారీగా తగ్గనున్నాయి. దీంతో రోగులకు నిత్య అవసరమైన మందుల భారం కొంతవరకూ తగ్గనుంది.
ప్రధాన మందుల ధరల తగ్గింపు
ఈ మేరకు కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. తగ్గించిన ధరలలో యేసిలోఫెనాక్, పారాసెటమాల్, ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ ఫిక్స్డ్-డోస్ కాంబినేషన్, అమోక్సిసిలిన్-పొటాషియం క్లావ్యులానేట్, అటోర్వాస్టాటిన్, ఎంపాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెట్ఫార్మిన్ వంటి మందులు ఉన్నాయి.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ విక్రయించే యేసిలోఫెనాక్-పారాసెటమాల్-ట్రైప్సిన్ కైమోట్రిప్సిన్ మాత్ర ధరను రూ.13గా నిర్ణయించగా, క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ అదే ఫార్ములేషన్ను రూ.15.01కు విక్రయించనుంది. గుండె వ్యాధులకు విస్తృతంగా వాడే అటోర్వాస్టాటిన్ 40 mg, క్లోపీడొగ్రెల్ 75 mg కాంబినేషన్ మాత్ర ధరను రూ.25.61గా నిర్ణయించారు. చిన్నపిల్లలకు వాడే సెఫిక్సిమ్, పారాసెటమాల్ ఓరల్ సస్పెన్షన్లు, విటమిన్ డీ లోపం ఉన్నవారికి ఇచ్చే కోలికాల్సిఫెరాల్ డ్రాప్స్, అలాగే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధరను రూ.31.77కి తగ్గించారు.
ఈ ధరల మార్పులు తక్షణమే అమల్లోకి రానున్నాయి. మెడికల్ షాపుల్లో రిటైలర్లు, డీలర్లు తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాలని కేంద్రం ఆదేశించింది. ఔషధాలను ఎక్కువ ధరకు విక్రయిస్తే ఔషధ ధరల నియంత్రణ ఆర్డినెన్స్ (DPCO) 2013, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ నిర్ణయాల వల్ల ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు ఔషధ ధరల భారం తగ్గుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల చికిత్స మరింత సులభం కావడంతో వారి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపనుంది.