TGRTC | సమ్మెకు దిగితే మీకూ, సంస్థకూ నష్టమే: కార్మికులకు యాజమాన్యం బహిరంగ లేఖ

హైదరాబాద్ :సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం బహిరంగ లేఖఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణపీఆర్సీ, డీఏ, ఆర్పీఎస్ బాండ్లు చెల్లించామని గుర్తుచేసిన యాజమాన్యంసమ్మె సంస్థకు, ఉద్యోగులకు నష్టం చేకూరుస్తుందని, విరమించుకోవాలని విజ్ఞప్తిసమ్మె పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరికతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) సిబ్బంది సమ్మెకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, సంస్థ యాజమాన్యం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.

సమ్మె ఆలోచనను విరమించుకోవాలని, సంస్థ అభివృద్ధికి సహకరించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ, ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులను వివరిస్తూనే, ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చింది. సమ్మె పేరుతో ఉద్యోగుల పట్ల బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది.సంస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను లేఖలో ప్రస్తావిస్తూనే, ఉద్యోగుల సంక్షేమం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో సిబ్బంది అందిస్తున్న నిబద్ధతతో కూడిన సేవల వల్లే టీజీఎస్‌ఆర్టీసీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొంది. ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ, డీఏలను ఇప్పటికే అందించినట్లు గుర్తు చేసింది.

అలాగే, ఆర్పీఎస్-2013 బాండ్లకు సంబంధించిన రూ. 280 కోట్లను కూడా చెల్లించినట్లు తెలిపింది. గత మూడున్నరేళ్లుగా ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు అందిస్తున్న విషయాన్ని కూడా లేఖలో ప్రస్తావించింది.టీజీఎస్‌ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి ఉద్యోగులందరికీ తెలిసిందేనని, ఇప్పుడిప్పుడే సంస్థ కోలుకుంటున్న తరుణంలో సమ్మె చేయడం వల్ల సంస్థతో పాటు ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుందని యాజమాన్యం ఆందోళన వ్యక్తం చేసింది.

2019లో జరిగిన సమ్మె, ఆ తర్వాత వచ్చిన కోవిడ్ మహమ్మారి వల్ల ఆర్టీసీ మనుగడే ప్రమాదంలో పడిందని గుర్తు చేసింది. ఉద్యోగుల సమష్టి కృషితోనే ఆ సంక్షోభాల నుంచి బయటపడి, ప్రజల ఆదరణ పొందుతున్నామని, ఈ సమయంలో సమ్మె చేయడం సరికాదని హితవు పలికింది.రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కట్టుబడి ఉందని లేఖలో స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొంది. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని, కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం చెప్పే మాటలకు ప్రభావితం కావద్దని సూచించింది. సమ్మెకు వెళితే సంస్థతో పాటు ఉద్యోగులకు కూడా తీవ్ర నష్టం జరుగుతుందని హెచ్చరించింది. ప్రజలకు రవాణా ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యతను గుర్తు చేసింది.

Leave a Reply