సూర్యాపేట : ఆర్థిక ఇబ్బందులు, లోన్ యాప్ల వేధింపుల కారణంగా మరో జీవితం బలి అయింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని బొల్లంపల్లి గ్రామానికి చెందిన 28 ఏళ్ల సుకుమార్ రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పని చేసే అతను, మూడు నెలల క్రితం ఉద్యోగం మానేసి హైదరాబాద్లో ఉంటూ కొత్త ఉద్యోగానికై ప్రయత్నాలు చేస్తుండగా, ఆర్థికంగా కుదేలయ్యాడు.
శివాలయ పండుగకు ఊరికి వచ్చిన యువకుడు..
ఐదు రోజుల క్రితం గ్రామంలో శివాలయ పండుగ నేపథ్యంలో సుకుమార్ ఇంటికి వచ్చినాడు. అయితే, గతంలో SBFC ఫైనాన్స్, Slice, Paytm, ఇతర ప్రైవేట్ మనీ లోన్ యాప్ల ద్వారా అతను పెద్ద మొత్తంలో లోన్లు తీసుకున్నాడు. ప్రతి నెలా వడ్డీతో పాటు అసలు చెల్లిస్తూ వచ్చిన అతనికి ఇటీవల ఆ డబ్బులు తీర్చలేని స్థితి ఏర్పడింది.
అన్నివైపులా ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ, కాల్లు, మెసేజ్లు ద్వారా జరుగుతున్న వేధింపులు అతనిపై మానసిక ఒత్తిడిని పెంచాయి. చివరికి బుధవారం ఉదయం తన ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి వంగాల సత్తయ్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అర్వపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.