హైదరాబాద్ – కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
దివంగత నేత బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా నేడు ఎల్ బి స్టేడియం వద్ద ఉన్న ఆయన విగ్రహానికి కిషన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా జగ్జీవన్ దేశానికి సేవలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు తమదే అని ధీమా వ్యక్తం చేశారు. తమకు సంఖ్యా బలం లేదని అందరూ అంటున్నారని.. కానీ అభివృద్ధిని కాంక్షిచే వారు బీజేపీకే ఓటు వేయబోతున్నారని చెప్పారు. ఇక అధికారంలో ఎవరు ఉన్నా మజ్లిస్కు హైదరాబాద్ రాసి ఇవ్వడం అలవాటుగా మారిందన్నారు. అందులో భాగంగానే ఈసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే వాళ్లతో అంటకాగి హైదరాబాద్ను దోచుకోవడం ఎంఐఎంకు పరిపాటి అయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి ఎంఐఎం కోటలు బద్దలు కొడతామని స్ఫష్టం చేశారు.
సంఖ్యా బలం ఉంటే బీజేపీనే గెలిచేదని.. సంఖ్యా బలం లేదు కాబట్టే ఓటింగ్ జరుగుతోందన్నారు. ఈ ఎన్నికల్లో 120 మంది ఓటర్లు ఆచితూచి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశంలో ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా, హిందువులకు, హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా ఉపన్యాసాలు ఇచ్చే పార్టీ మజ్లిస్ పార్టీ అంటూ మండిపడ్డారు. గతంలో హైదరాబాద్లో అనేక సార్లు మతకలహాలు ప్రేరింపించిందన్నారు. అలాంటి మజ్లిస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేయకుండా ఉండటం రాజకీయ కుట్రే అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కూడా ఎంఐఎంకు బానిసత్వంతో ఉండే పార్టీలని వ్యాఖ్యలు చేశారు. మజ్లిస్ పార్టీని పెంచి పోషిస్తున్నాయని ఆరోపించారు. మజ్లిస్ పార్టీ కనుసైగలో ఈ రెండు పార్టీలు నడుస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండూ కూడా ఎంఐఎం పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతూ పెంచి పోషిస్తున్నాయన్నారు. మజ్లిస్కు ఓటేస్తే ప్రజలెవరూ కూడా క్షమించరని అన్నారు.
హైదరాబాద్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు. ఈసారి కచ్చితంగా హైదరాబాద్ నగరంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని.. మేయర్ పీఠం మీద కూర్చోబోయేది భారతీయ జనతా పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోకల్ బాడీ ఎన్నికలకు, జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధం లేదని అన్నారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించి మజ్లిస్ పార్టీని ఓడించాలని… బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. పార్టీలో అంతర్గత విబేధాలు ఉండటం సహజమని చెప్పుకొచ్చారు. అలాంటివి ఏవైనా ఉంటే పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.