దేశంలో న్యాయవ్యవస్థ పనితీరుపై ఇండియా జస్టిస్ విడుదల చేసిన రిపోర్ట్-2025 లో తెలంగాణా న్యాయస్థానాలకు ప్రశంసలు లభించాయి. నూటికి నూరు శాతం కేసులను పరిష్కరిస్తూ తెలంగాణ ద్వితీయస్థానం సాధించింది. వరుసగా మూడేళ్ల నుంచి 100శాతం కేసుల క్లియరెన్స్తో తెలంగాణలో న్యాయపాలన మెరుగ్గా ఉందని ఈ నివేదిక పేర్కొంది.
కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, టీ-ఎస్-ప్రయాస్, హౌ ఇండియా లీవ్స్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ లాంటి సంస్థల సహకారంతో టాటా ట్రస్టు ఈ అధ్యయనం నిర్వహించింది.
దేశంలోని జిల్లా కోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం 2025లో 38.3 శాతానికి పెరిగింది. కాగా 55.3 శాతంతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంది. హైకోర్టుల్లో మహిళా జడ్జీల ప్రాతినిధ్యం దేశవ్యాప్తంగా 14 శాతం ఉండగా తెలంగాణలో అత్యధికంగా 33.3 శాతంగా ఉన్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది.