TG | దేశ‌భ‌ద్ర‌త‌కే తొలి ప్రాధాన్యం… సైనికులకు సంఘీభావంగా రేపు ర్యాలీ: రేవంత్ రెడ్డి

హైదరాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో రాజకీయాలకు తావు లేదని, మ‌న దేశ భ‌ద్ర‌తే ముఖ్యమ‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధ‌వారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఇతర సంబంధిత వివిధ విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. అత్యవసర సర్వీస్ లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో సీఎం నిర్ణయం తీసుకున్నారు.

పాకిస్థానీయులు, బంగ్లాదేశీయుల‌ను అదుపులోకి తీసుకోవాలి
రాష్ట్రంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని ముఖ్య‌మంత్రి ఆదేశించారు. ఉద్యోగులు, మంత్రులందరూ అందుబాటులో ఉండాలని సీఎం సూచించారు. విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలన్నారు. ఫేక్ న్యూస్ ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ప్రైవేటు ఆస్ప‌త్రుల్లో బెడ్స్ అందుబాటులో ఉంచాలి
ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర మెడిసిన్, ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని, బ్లడ్ బ్యాంకు ల్లో రక్తనిలువలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

భద్రత పెంచండి
అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని శాంతి భద్రతల కు భంగం కలుగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూం కి అనుసంధానం చేయాలన్నారు. హైదరాబాద్ లోని అన్ని విదేశీ రాయభార కార్యాలయాలు, ఐటీ సంస్థల వద్ద భద్రత పెంచాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ సెక్యూరిటీ మీద దృష్టి సారించాలన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అవసరమైతే పీస్ కమిటీ లతో మాట్లాడాలని హిస్టరీ షీటర్ లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ డిపార్ట్ మెంట్ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.

సైన్యానికి సంఘీభావంగా రేపు ర్యాలీ

దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇచ్చేలా భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం 6 గంటలకు సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఇతర నేతలు హాజరుకానున్నారు.

ప్రతి భారతీయుడు గర్వపడుతున్నాడు

భారత భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప‌ట్ల ప్ర‌తి భార‌తీయుడు గ‌ర్వ‌ప‌డుతున్నాడ‌ని రేవంత్ రెడ్డి అన్నారు. భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల ప్రతి భారతీయుడు గర్వ పడుతున్నాడని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రతి పౌరుడు ఆర్మీకి అండగా ఉండాలని పిలుపునిచ్చాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను బాధ్యతలు తాను నిర్వర్తిస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ పార్టీలను పక్కకు పెట్టి ఒక్కటిగా ఉండాల్సిన సమయం ఇది అని అన్నారు. భారత రక్షణ రంగంలో హైదరాబాద్ పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో శత్రు దేశం దాడి చేస్తుందన్న సంకేతాల మేరకు రాష్ట్రంలో అన్ని విభాగాలను అప్రమత్తం చేశామని రేవంత్ రెడ్డి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *