హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములపై విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయి హెచ్సీయూ భూముల వ్యవహారంపై చర్చించారు. ఈ భూముల వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి? అంటూ చర్చించారని తెలిసింది. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకు వెళ్దామనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.
400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లోనే నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ సర్కార్ వెల్లడించిన సంగతి విదితమే. వర్సిటీ, ప్రభుత్వం మధ్య పరస్పర అవసరాల కోసం భూమార్పిడి అగ్రిమెంట్ చేసుకోగా అందులో యూనివర్సిటీ అధికారులు చేసిన సంతకాలతో కూడిన పత్రాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయినా టీజీఐఐసీకి అప్పగించిన భూముల విషయంలో హెచ్సీయూ రిజిస్ట్రార్ ప్రభుత్వానికి విరుద్ధమైన ప్రకటన చేయడం వెనుక ఏం జరుగుతోందనే అంశంపై సీఎం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.