హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన్ను వరంగల్ సుబేదారి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్టులో అరెస్ట్ చేసిన అనంతరం నేడు (జూన్ 21) కోర్టులో హాజరుపరిచారు. కాగా, విచారణ అనంతరం న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి 14 రోజుల న్యాయ రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆయనను వరంగల్ జైలుకు తరలించినట్టు సమాచారం.
కమలాపురం మండలం వంగపల్లిలోని గ్రానైట్ వ్యాపారి కుటుంబం ఆయనపై బెదిరింపుల కేసు పెట్టగా, దీనికి సంబంధించి ఐపీసీ సెక్షన్లు 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిసిందే. కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్ను కోర్టు ఇప్పటికే తిరస్కరించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును, 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ను బిఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శించారు. అసమర్థ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్ని వందల తప్పుడు కేసులు పెట్టినా, రేవంత్ రెడ్డి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.