TG | మ‌రో రెండు నెల‌ల్లో ఆర్ ఆర్ ఆర్ కు అనుమతులు – గడ్కరీ హామీ

కొత్త ఢిల్లీ – రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అన్ని అనుమతులు రెండు నెలల్లో ఇస్తామని, అన్ని క్లియరెన్స్ లు వచ్చాక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళతామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. కొత్త డిల్లీలో నేడు గడ్కరీతో మంత్రి భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంగారెడ్డి-భువనగిరి-చౌటుప్పల్ వరకు ఆర్ఆర్ఆర్ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. దాదాపు 95 శాతం భూసేకరణ కూడా పూర్తయిందని, రూ. 1000 కోట్లతో 12 ఆర్వోబీలు కూడా మంజూరు చేశారని తెలిపారు.

హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి ఆరు లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీ ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు రోడ్డు విస్తరణ ఆలస్యమవుతోందని, దీంతో గుడిమల్కాపూర్ నుంచి విజయవాడకు ఒక ప్యాకేజీ, విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు మరో ప్యాకేజీగా విభజించి టెండర్లు పిలవాలని అధికారులకు గడ్కరీ ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు. శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్‌కు సంబంధించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *