హైదరాబాద్, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ ( Kavitha ) దమ్ము ఏంటన్నది కాంగ్రెస్ పార్టీ (Congress party) నాయకులకు తెలుసునని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) అన్నారు. బుధవారం ఆమె అబిడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పోస్ట్ కార్డ్ (post card) రాశారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు రెడీ అన్నారు. తన కలలో కూడా కేసీఆర్ తెలంగాణకు నష్టం చేయరని, కేసీఆర్ దమ్ము ఎంతో కాంగ్రెస్ నేతలకు బాగా తెలుసునన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, కేసీఆర్ తెచ్చిన తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారన్నారు.చంద్రబాబుకు గోదావరి గిఫ్ట్ ఇచ్చిన రేవంత్ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ తినిపించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
గోదావరి నీటిని గిఫ్ట్ ప్యాకెట్ కట్టి రేవంత్ చంద్రబాబుకు ఇచ్చారన్నారు. కేసీఆర్ హయాంలో బనకచర్ల ఊసే లేదన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ ఎక్కడా సంతకాలు పెట్టలేదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్పై రేవంత్ వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నమన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని, హైకోర్టు ఇచ్చిన సమయం లోపు గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించుకోవచ్చన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ను తెలంగాణ సమాజం క్షమించదని కవిత వ్యాఖ్యానించారు.