హైదరాబాద్, ఆంధ్రప్రభ :వ్యక్తిగత దూషణలు, విమర్శలు వచ్చినా సహించామని, కానీ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగ సంఘాల నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు తట్టుకోలేకపోతున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
ఈ 17 నెలల కాలంలో తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నయ్ ఎట్ల..? అనుముల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నయ్ ఎట్ల..? ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీసింది అంటున్నవ్.. మరి నీ కుటుంబం ఆస్తులు ఎట్ల పెరుగుతున్నాయని కేటీఆర్ అడిగారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో .మాట్లాడుతూ , తెలంగాణ సాధనలో విద్యార్థులు, ఉద్యోగ సంఘాల నాయకులు పార్టీలకతీతంగా పాల్గొన్నారని గుర్తుచేస్తూ, అలాంటి నేతలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు బాధాకరంగా ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరు చూస్తే చేతకాని వాడిని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ హామీలు శతాబ్దపు అబద్ధంకాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలను మోసం చేసే అబద్ధాలుగా తేలిపోయాయని, తాము ఎప్పటి నుంచో ఢిల్లీ పార్టీలను నమ్మరాదని చెబుతున్నామని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ, పలు హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించారు. ఉద్యమ సమయంలో ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా ఎన్జీఓలు కీలకంగా కదం తొక్కాయన్నారు. వారి పోరాటం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే ఉద్యమ నేతలకు గౌరవంగా ఉన్నత జీతాలు కల్పించామన్నారు. రేవంత్ రెడ్డి ఉద్యమంలో భాగం కాలేదని, ఉద్యమ ద్రోహిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
లెక్కల్లో అస్పష్టత
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇస్తున్న లెక్కల్లో అస్పష్టత ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు మొత్తం 4.15 లక్షల కోట్లకే పరిమితమని, ప్రభుత్వం నుండి విరమించిన సమయంలో ఆదాయం నెలకు 18 వేల కోట్లు ఉందని వివరించారు. ఇప్పుడూ అదే ఆదాయం వస్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించలేకపోతోందని విమర్శించారు.
కాంగ్రెస్ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అప్పు లెక్కల్ని గందరగోళంగా మార్చుతున్నారని, ఒకసారి 6 లక్షల కోట్లు, తర్వాత 8.29 లక్షల కోట్లు అంటూ లెక్కల్లో అస్పష్టతగా చూపుతున్నారన్నారు.అన్ని రంగాల్లో సంక్షోభంకేసీఆర్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఇప్పుడు అన్నిరంగాల్లో సంక్షోభం నెలకొందని కేటీఆర్ అన్నారు. రైతు బంధు, విద్యుత్ సరఫరా, నీటి కొరత వంటి అంశాల్లో కేసీఆర్ హయాంలో స్థిరత ఉందని, ఇప్పుడు అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారని విమర్శలు గుప్పించారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి, ఇప్పుడు వారినే ప్రజల ముందు విలన్లుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టిన కేసీఆర్ పాలన తరువాత ఇప్పుడు విపరీత పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలు ఈ పరిస్థితిని గమనిస్తున్నారని అన్నారు.