బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం
ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా..
బీఆర్ఎస్ కృషి ఎంతో ఉంది
అప్పులపై సర్కారు తప్పుడు ప్రచారం
అబద్ధాలు ఒప్పకుంటే హుందగా ఉంటుంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆంధ్రప్రభ :
2025-26 బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయని ఈ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృషి ఎంతో ఉందన్నారు. శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర అప్పులు మొత్తం రూ.4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
అప్పులపై దుష్ప్రచారం
సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ.8 లక్షల కోట్లు అప్పులు చేశామని దుష్ప్రచారం చేస్తున్నారని కవిత మండిపడ్డారు. శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించిందని సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించామన్నారు. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినట్లు చెప్పారు. ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యలపై గళమెత్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతీ రోజూ వినూత్న రీతిలో నిరసనలు, కేసీఆర్ పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపామన్నారు.
ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది
అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజాలు చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుందన్నారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో చెప్పారన్నారు. నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం.
ఏప్రిల్ 27న హనుమకొండలో రజతోత్సవం
ఏప్రిల్ 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుగుతుందని కవిత తెలిపారు. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై మేము చేసిన పోరాటానికి దిగొచ్చిందని ఎప్పటికప్పుడు ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారన్నారు. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుషపదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడారని చరిత్రలో సీఎం వ్యాఖ్యలు ఓ మచ్చగా ఉంటాయన్నారు.