TG | భార‌తీయుడిగా గ‌ర్వ‌ప‌డుతున్నా : కేసీఆర్

హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా తాను గ‌ర్వ‌పడుతున్నాని బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏరూపంలో ఉన్నా.. ఏ దేశంలో వున్నా.. ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేదికాదు. ఉగ్రవాదం అంతం కావాల్సిందే అని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. ఈ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై, ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయ‌న్నారు. భారత సైన్యం ఎంత విరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండి దేశరక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.

భార‌త సైన్యానికి సెల్యూట్.. జైహింద్ – కేటీఆర్‌

పాకిస్తాన్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై భార‌త సైన్యం మిస్సైళ్ల‌తో మెరుపు దాడి చేయ‌డంపై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. పాకిస్తాన్, పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లోని ఉగ్ర‌వాద శిబిరాల‌పై మెరుపు దాడులు చేసిన భార‌త సైన్యానికి సెల్యూట్‌ చేస్తున్నాన‌ని కేటీఆర్ పేర్కొన్నారు. ఉగ్ర‌వాద మౌలిక స‌దుపాయాల‌ను పూర్తిగా నిర్మూలించ‌డంలో భార‌త సైన్యానికి మ‌రింత శ‌క్తి, బ‌లం కావాల‌ని కోరుకుంటున్నాన‌ని తెలిపారు. చివ‌ర‌గా జైహింద్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

భార‌త సైన్యాన్ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నాను… ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు

భార‌త్ భూభాగంలో ఉగ్ర‌వాదానికి స్థానం లేదు.. భార‌త‌దేశం ఎల్ల‌ప్పుడూ ఉన్న‌తంగా నిలుస్తుంది అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. మ‌న శాంతిపై ఉగ్ర‌వాదం చేసిన‌ప్పుడు, మ‌న ఐక్య‌త బ‌లంతో, మ‌న సైనికుల ధైర్యంతో మ‌నం ప్ర‌తిస్పందిస్తామ‌ని హ‌రీశ్‌రావు అన్నారు. భార‌త సైన్యాన్ని చూస్తుంటే చాలా గ‌ర్వంగా ఉంద‌న్నారు. వారికి వెన్నుద‌న్నుగా నిల‌బడుతామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. జై హింద్ అని హ‌రీశ్‌రావు నిన‌దించారు.

Leave a Reply