హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ లోని హైటెక్ సిటీ (Hi tech city) గూగుల్ దివ్యశ్రీ భవన్లో గూగుల్ (google ) ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (safety Engineering center ) ను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు.
ఇండియాలో తొలి కేంద్రం
ఇండియాలో మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయడం విశేషం. ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత గూగుల్ నెలకొల్పుతున్న రెండో సెంటర్ ఇది. ప్రపంచంలోనే ఇది ఐదోవది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అనేది అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. అధునాతన భద్రతతో పాటు ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, అత్యాధునిక పరిశోధన, సైబర్ సెక్యూరిటీ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, పరిశోధకులకు చక్కని ప్లాట్ఫాంగా జీఎస్ఈసీ ఉపయోగపడనుంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో ఐటీ రంగంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.