అభినందించిన మంత్రి పొన్నం
సంస్థాన్ నారాయణపురం: ఆర్టీసీలో (RTC ) తొలి మహిళా బస్ డ్రైవర్గా (Women Driver ) యాదాద్రి భువనగిరి జిల్లా (Bhuvangiri ) సంస్థాన్ నారాయణపురం మండలం సీత్యతండాకు (Sityatanda ) చెందిన సరిత (Saritha ) రికార్డు సృష్టించారు. శనివారం విధుల్లో చేరిన ఆమె.. మొదటిరోజు హైదరాబాద్ (Hyderabad ) నుంచి మిర్యాలగూడకు ( Miryalaguda )బస్ నడిపారు. ఇన్నిరోజులు ఢిల్లీలో డ్రైవర్గా విధులు నిర్వహించిన సరిత ప్రత్యేక అనుమతితో తెలంగాణ ఆర్టీసీలో చేరారు. గతంలో ఢిల్లీలో రవాణా సంస్థలో పదేళ్లుగా ఆమె డ్రైవర్గా విధులు నిర్వహించారు. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా తనకు స్వస్థలంలో డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని ఇటీవల రవాణా శాఖ మంత్రి (Transport ) పొన్నం ప్రభాకర్ (Ponnam prabhakar ) ను కలిసి విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన మంత్రి పొన్నం ఆర్టీసీ అధికారులతో మాట్లాడి తెలంగాణ ఆర్టీసీ మిర్యాలగూడ డిపోలో నియమించారు.
తనకు అవకాశం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్కి మహిళా డ్రైవర్ సరిత ధన్యవాదాలు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అడుగులు వేస్తుందని ఇప్పటికే మహా లక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రత్యేక పథకాలు, తాజాగా ఆర్టీసీలో మహిళా డ్రైవర్గా అవకాశం ఇవ్వడం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా డ్రైవర్ వి.సరిత ను మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.
సరిత నేపథ్యం …
సీత్యతండాకు చెందిన వాంకుడోతు సరిత.. రాంకోటి, రుక్కా దంపతుల ఆరుగురు సంతానంలో ఐదో అమ్మాయి. నలుగురు అక్కల పెండ్లి కోసం తన తండ్రి ఉన్న మూడెకరాల భూమిని అమ్మేయడంలో కుటుంబ పోషణ భారమైంది. దీంతో అక్క దగ్గర ఉంటూ నల్లగొండ జిల్లా దేవరకొండలో 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివింది. అక్కడ నుంచి 10వ తగతి వరకు ఓపెన్ స్కూల్లో విద్యను అభ్యసించారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో కుటుంబ బాధ్యత తీసుకున్నారు. ఈ క్రమంలో ఆటో నడటం నేర్చుకున్నారు. ఐదేండ్లు సంస్థాన్ నారాయణపురం నుంచి సీత్యతండా వరకు ఆటో నడిపారు. అనంతరం హైదరాబాద్లోని బంధువుల ఇంట్లో ఉంటూ బస్సు డ్రైవింగ్ నేర్చుకుని హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నారు.
2010లో నల్లగొండ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవడంతో దరఖాస్తు చేశారు. అయితే అధికారులు మహిళలను డ్రైవర్లుగా తీసుకోలేమని ఆమె దరఖాస్తును తిరస్కరించారు. ఈ క్రమంలో ఆజాద్ ఫౌండేషన్ సహకారంతో ఢిల్లీకి వెళ్లిన సరిత కొన్నాళ్లపాటు కారు నడిపారు. రెండేండ్ల తర్వాత ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లో 15 మంది మహిళా డ్రైవర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అందులో సరిత ఒక్కతే ఎంపికయ్యారు. దీంతో దేశంలో మొదటి మహిళా డ్రైవర్గా గుర్తింపు పొందారు. ఢిల్లీలోని సరోజినీ డిపోలో ఉద్యోగం చేస్తూ రోజూ 185 కిలోమీటర్ల దూరం బస్సు నడిపారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2018లో నాటి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్ చేతుల మీదుగా ప్రత్యేక పురస్కారం, కిరణ్ బేడీ వంటి ప్రముఖుల చేతుల మీదుగా ‘ఉమెన్ అచీవర్స్’ అవార్డును అందుకున్నారు.
అయితే, ఢిల్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉండటం, ఖర్చులు ఎక్కువగా ఉండటంతోపాటు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండటంతో వారిని చూసుకోవడానికి రాష్ట్రంలో బస్ డ్రైవర్గా అవకాశం ఇవ్వాలని గతంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని, సంబంధిత మంత్రి పొన్నం ప్రభాకర్ను కోరారు. వారు స్పందించి ఆర్టీసీ డ్రైవర్గా ఆమెకు అవకాశం కల్పించారు. దీంతో హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు బస్సును నడిపి ఆర్టీలో తొలి మహిళా డ్రైవర్గా నిలిచారు.