TG | వైద్య కళాశాలల అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష !

  • 34 ప్రభుత్వ వైద్య కళాశాలలకు పూర్తి స్థాయి వసతులు కల్పించడంపై ఆదేశాలు

హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో పనిచేస్తున్న 34 ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకోసం అవసరమైన కార్యాచరణ ప్రణాళికను తక్షణం రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఈ మేరకు రాష్ట్రంలోని ప్రతీ వైద్య కళాశాల పరిస్థితిని సమీక్షించేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ఆ కమిటీ ప్రతి కళాశాలను ప్రత్యక్షంగా సందర్శించి, సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు.

జాతీయ వైద్య మండలి (ఎన్‌ఎంసీ) లేవనెత్తిన సమస్యలపై ముఖ్యమంత్రి తాజాగా తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ (ఐసీసీసీ)లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఉద్యోగ నియామకాలు, బోధన సిబ్బంది ప్రమోషన్లు, అనుబంధ ఆసుపత్రుల్లో పడకల పెంపు, అవసరమైన వైద్య పరికరాల సమకూర్పు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం చేయదని, అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేస్తామని చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి రావాల్సిన నిధులు, అనుమతుల విషయాలు ఉంటే వెంటనే తెలియజేయాలని అధికారులకు సూచించారు. వాటిని పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా, సంబంధిత అధికారులతో సంప్రదిస్తామన్నారు.

ఇదే సందర్భంలో నర్సింగ్ కళాశాలల్లో జపనీస్ భాషను ఓ ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలని సీఎం సూచించారు. జపాన్‌లో నర్సింగ్ సిబ్బందికి భారీగా డిమాండ్ ఉందని, దీనికి జపాన్ ప్రభుత్వం నుంచి మద్దతు లభించనుందని తెలిపారు.

ఇక ఆసుపత్రులకు వచ్చే రోగులు, వారిని పరీక్షించే వైద్యులు, ఆసుపత్రుల పని సమయాల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ వినియోగంపై అధ్యయనం చేయాలన్నారు. విద్యా, వైద్య రంగాలు రాష్ట్రాభివృద్ధికి కీలకమైనవని గుర్తుచేసిన సీఎం, ప్రతి నెల మూడో వారంలో ఈ రెండు శాఖలపై సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Leave a Reply