పరిష్కారం కాని ప్రజా సమస్యలు..

పరిష్కారం కాని ప్రజా సమస్యలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వాలు , పాలకులు మారుతున్నా మండలంలోని దీర్ఘకాళిక ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు మాత్రమే హామీలు ఇచ్చి అమలు చేయడంలో విఫలం అవుతున్నారని, దీర్ఘకాళిక ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని పాలడుగు గ్రామ శాఖ సమావేశం వెండి యాదగిరి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా వెంకట్ నర్సు మాట్లాడుతూ ప్రభుత్వాలు, పాలకులు మారుతున్న మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కారం కావడం లేదని, మోత్కూర్ మండలంలో రోడ్లు, సాగునీటి కాల్వలు, విద్యా, వైద్యం, ఇలా అన్ని రంగాలలో అభివృద్ధిలో వెనుకబడి ఉందని, దీర్ఘకాలిక సమస్యలైన ఆర్టీసీ డిపో, 30 పడకల ఆసుపత్రి, పోస్ట్ మార్టం సౌకర్యం, ప్రభుత్వ డిగ్రీ కాలేజి, రెవిన్యూ డివిజన్, సివిల్ కోర్ట్, గురుకులాలకు సొంత భవనాలు, గుండాల -మోత్కూర్ మధ్య బిక్కెరు వాగుపై నూతన బిడ్జి నిర్మాణం లాంటి సమస్యల పరిష్కారానికి మండల ప్రజలు దశబ్దాలుగా ఎదిరుచూస్తున్నారని అన్నారు.
గత ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దాదాపు రెండు సంవత్సరాలు గడచిన ఏఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. బునాదిగాని కాల్వ పనులు పూర్తి చేస్తామని రూ .261 కోట్లు మంజూరైనట్లు ప్రభుత్వం ప్రకటించి , ఏడాది దాటిన ఇప్పటి వరకు ఏలాంటి పనులు ప్రారంభించలేదని, అసంపూర్తిగా ఉన్న కాల్వతో సాగు నీరులేక మోత్కూర్ , అడ్డగూడూర్ మండలాల రైతులు బావులు, బోర్లలో భూగర్భజలాలు అడుగంటి పంటపొలాలు ఎండిపోతున్నాయని, కాల్వపనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. నిధులు లేవన్న సాకుతో అనేక గ్రామాలలో నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయని, తక్షణమే మండల ప్రజా సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, సహాయ కార్యదర్శి కొంపల్లి గంగయ్య, చింతకింది సోమరాజు, దడిపల్లి సైదులు తదితరులు పాల్గొన్నారు.
