హైదరాబాద్ : ఉద్యోగ సమస్యల పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలతో చర్చల కోసం తాజాగా కమిటీని నియమించింది. ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ అధికారుల కమిటీలో నవీన్ మిట్టల్, లోకేశ్ కుమార్, కృష్ణ భాస్కర్ ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. గుర్తింపు కలిగిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నిర్దిష్టమైన ఆచరణీయమైన సిపార్సులతో వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది.తమ సమస్యల పరిష్కారం కోసం పోరుబాట పడతామని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ నేతలు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
అయితే జేఏసీ నేతల ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలిచ్చి జీతాలిస్తున్న ప్రజలపై యుద్ధం ప్రకటిస్తారా? అంటూ ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై సీఎం మండిపడ్డారు. పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ చర్చల కోసం కమిటని ఏర్పాటు చేశారు..