Telanagana | నెగెటివ్ పాల‌సీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి – కెటిఆర్

ఏడాది పాటు సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు
1200 ఎక‌రాల్లో వేదిక ఏర్పాటు
మూడు వేల బ‌స్సులు ఇవ్వ‌డానికి ఆర్టీసీ అంగీకారం
ఇదో పేద స‌భ‌
పెట్రోల్ ధ‌రల పెంపుపై మండిపాటు
బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..?
బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఏఐ అంటే అనుముల ఇంటెలిజెన్స్ అని మేము అనొచ్చు అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఏఐ వీడియోల పేరుతో త‌ప్పించుకోవాల‌ని కాంగ్రెస్ ప్ర‌భుత్వం భావిస్తోందన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. రాష్ట్రంలో నెగెటివ్ పాల‌సీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ స‌ర్పంచ్ నుంచి మాజీ సీఎం వ‌ర‌కు కేసులెలా పెట్టాల‌ని చూస్తున్నారు. ప్ర‌భుత్వాన్ని ఇబ్బంది పెట్టాల‌నే ఉద్దేశంలో మేం లేము. హెచ్‌సీయూ విద్యార్థుల‌పై కేసుల ఉప‌సంహ‌ర‌ణ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తున్నాం. కేసుల ఉప‌సంహ‌ర‌ణ స‌రిపోదు.. జంతువ‌ధ కార‌కుల‌పై కేసులు పెట్టాలి. సోష‌ల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేయిస్తున్నారు. భారీగా ఖ‌ర్చు చేసి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడికి పాల్ప‌డుతున్నారు. బీసీ రిజ‌ర్వేష‌న్లు అసాధ్య‌మ‌నే కాంగ్రెస్ దీక్ష‌కు రాహుల్ గాంధీ వెళ్ల‌లేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.

మ‌రో భూకుంభ‌కోణం ర‌ట్టు చేస్తా
రెండు జాతీయ పార్టీల జుట్టు ఢిల్లీ చేతుల్లోనే ఉంటుంది. ఒక‌రు చెప్పులు మోస్తే.. ఇంకొక‌రు బ్యాగుల‌ను మోస్తున్నారు. 16, 17 నెల‌లైనా మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించుకునే ప‌రిస్థితి లేదు. ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా ఒక్క రూపాయి కూడా రాలేదు. మీనాక్షి న‌ట‌రాజ‌న్ స‌చివాల‌యంలో స‌మీక్ష‌లు చేస్తున్నారు. రేవంత్ విఫ‌ల సీఎం కాబ‌ట్టే కాంగ్రెస్ హైక‌మాండ్ జోక్యం చేసుకుంటుంది. నాకు ద‌క్క‌నిది ఎవ‌రికీ ద‌క్క‌కూడ‌ద‌ని రేవంత్ ఆలోచిస్తున్నారు. కంచ గ‌చ్చిబౌలి భూముల వెనుక వేల కోట్ల బాగోతం ఉంది. కంచ గ‌చ్చిబౌలి భూముల వెనుక బీజేపీ ఎంపీ కూడా ఉన్నారు. వేల కోట్ల రూపాయాల బాగోతం 2,3 రోజుల్లో చెబుతా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ ఉమ్మ‌డి ముఖ్య‌మంత్రి. దేశంలోని ప‌వ‌ర్ ఫుల్ సీఎంల్లో రేవంత్ నంబ‌ర్ వ‌న్‌గా ఉండాలి అని కేటీఆర్ అన్నారు.

ఎపి జ‌ల‌దోపిడి… రేవంత్ మౌనం.

గోదావ‌రి, కృష్ణా జలాల్లో విచ్చ‌ల‌విడి జ‌ల‌దోపిడీ జ‌రుగుతోంది. భూకంపం, భారీ వ‌ర‌ద వ‌చ్చినా మేడిగ‌డ్డ చెక్కు చెద‌ర‌లేదు. కేసీఆర్‌పై కోపంతో నీళ్లు వ‌దిలేశారు.. పంట‌లు ఎండుతున్నాయి. ఆదిత్య‌నాథ్ దాస్‌ను స‌ల‌హాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్య‌నాథ్ దాస్ గ‌తంలో ఏపీ త‌ర‌పున వాదించారు. ఆదిత్య‌నాథ్ దాస్ నియామ‌కం ఏపీ ప్ర‌యోజ‌నాల కోస‌మా..? ఏపీ, చంద్ర‌బాబు కోస‌మే ఆదిత్య‌నాథ్‌ను నియ‌మించారా..? కృష్ణాలో అన్ని జ‌లాశ‌యాలు నిండాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే పంట‌లు ఎండుతున్నాయని కేటీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏడాది పాటు ర‌జ‌తోత్స‌వ వేడుక‌లు

తెలుగునాట విజ‌య‌వంతంగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు తంగా 25 ఏండ్లు బీఆర్ఎస్, టీడీపీ మాత్ర‌మే కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వ‌ర్ జూబ్లీ ఉత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని కేటీఆర్ తెలిపారు. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా, ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంద‌న్నారు. 1200 ఎకరాల్లో పార్కింగ్‌తో పాటు సభ ఏర్పాట్లు చురుగ్గా జ‌రుగుతున్నాయ‌న్నారు. ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశామ‌ని, ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించింద‌న్నారు. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇదో పెద్ద స‌భ
త‌మ‌ పార్టీ చరిత్రలో ఇదో పెద్ద స‌భ అవుతుంద‌ని కేటీఆర్ అన్నారు. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తామ‌న్నారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంద‌న్నారు. సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుంద‌ని చెప్పారు. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను ఇతర కమిటీలను వేసుకుంటామ‌న్నారు. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయ‌న్నారు. ప్రతినెలా ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలలపాటు కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామ‌ని చెప్పారు. ప్రభుత్వం గతంలో త‌మ‌ పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింద‌న్నారు. ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

పెట్రోల్ ధ‌రల పెంపుపై మండిప‌డ్డ కేటీఆర్
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరల పెంపుపైన కేటీఆర్ మండిప‌డ్డారు. అమెరికా అడ్డగోలుగా పెంచిన నూతన టారిఫ్ వలన తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుంద‌ని పేర్కొన్నారు. నిన్న పెంచిన ధరలు అసాధారణం అని కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్యాస్ పెట్రోల్ ధరలు పెంచింద‌న్నారు. మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గాల్సింది పోయి పెరుగుతున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పెట్రోల్ ధరల పెంపు వ‌ల్ల‌ నిత్యావసర సరుకుల ధరలు రవాణా చార్జీలు భారీగా పెరుగుతాయ‌ని చెప్పారు. సామాన్యుడి జీవితం అతలాకుతలమవుతుంద‌ని, బీజేపీ చెప్పిన అచ్చే దిన్ తీసుకురావడం ఇదేనా..? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

ట్రంప్ దెబ్బ‌కు తెలంగాణ కుదేలు..
ట్రంప్ తీసుకువచ్చిన నూతన టారిఫ్ విధానంపైన కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మాట్లాడలేదని కేటీఆర్ అన్నారు. పార్లమెంట్లో చర్చ పెట్టమని డిమాండ్ చేసినా పెట్టడం లేద‌న్నారు. అమెరికా పన్ను వల్ల తెలంగాణకు పెద్ద దెబ్బ తగలబోతుంద‌ని చెప్పారు. తెలంగాణ నుంచి అధికంగా ఎగుమతులు అయ్యే ఫార్మా, ఐటీ ఎగుమతులపైన అమెరికా విధించిన పన్నుల వల్ల తెలంగాణకు తీవ్రంగా నష్టం చేకూర్చబోతున్నాయ‌న్నారు. తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా ఉన్న ఈ రెండు రంగాలకు దెబ్బ తగిలితే తెలంగాణ ఆర్థిక ప్రగతి దెబ్బతింటుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు.

ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన విధానాల వలన జీఎస్టీ పెరుగుదల జీరో శాతంగా ఉంద‌ని, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేయడం రావడం లేద‌న్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వ‌చ్చార‌న్నారు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప మిగిలిన అన్ని రంగాలలో ఆదాయం పెంచడంలో విఫలమైంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల లోపాలే ప్రధాన కారణం. రాష్ట్రంలో ఉన్నది నెగిటివ్ పాలసీలు.. నెగిటివ్ పాలిటిక్స్. ఒకటి రెండు రోజుల్లో 400 ఎకరాల్లో ఎవరెవరు ఉన్నారో క్లియర్‌గా చెప్తాను అని కేటీఆర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *