Supreme Court | వక్ఫ్ బిల్లుపై సుప్రీం కోర్టులో విచార‌ణ – రేపు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులిస్తామ‌న్న‌చీఫ్ జ‌స్టీస్

న్యూ ఢిల్లీ – వక్ఫ్ బోర్డు చట్టంపై ధాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టులో త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ విచారణ చేపట్టింది. వక్ఫ్ బిల్లు చట్టభద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్, టీఎంసి ఎంపీ మహువా మొయిత్ర, ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహమాన్, అర్జీడి ఎంపీ మనోజ్ కుమార్ ఝ, ఆప్ ఎమ్మెల్యే అమనాతుల్లా ఖాన్, మణిపూర్ ఎమ్మెల్యే షేక్ నూరుల్ హాసన్, వైసీపీ, డిఎంకె, టీవికే అధినేత విజయ్, సిపిఐ సహా కొన్ని ముస్లిం సంఘాలు ఉన్నాయి. ఇక, పిటీషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు.

మరోవైపు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణకు ముందు తమ వాదనలు కూడా వినాలని పలు రాష్ట్రాలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషన్లు దాఖలు చేసిన రాష్ట్రాల్లో అస్సాం, రాజస్థాన్, ఛత్తీస్‌ఘఢ్, ఉత్తరాఖండ్, హర్యానా, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వీరంతా ఈ చట్టాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఇక, కపిల్ సిబాల్ వాదనల ప్రకారం పార్లమెంటు చట్టం ద్వారా మత విశ్వాసంలో కీలకమైన అంతర్భాగ అంశాలలో తలదూర్చారని కపిల్ సిబాల్ అత్యున్నత న్యాయంస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఆర్టికల్ 25, 26లకు వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం ఉందని కపిల్ సిబాల్ అన్నారు. “చట్టం ప్రకారం” అనే పదాలు ముస్లిం మతానికి సంబంధించిన ముఖ్యమైన ఆచారాన్ని ప్రభావితం చేస్తాయని కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించారు. “చట్టం ప్రకారం” అనే పదబంధం ఇస్లాం మతానికి సంబంధించి మౌలికమైన ఆచారాలను దూరం చేస్తుందని ఆయన కోర్టుకు తెలిపారు. వక్ఫ్-అలల్-ఔలాద్‌ను సృష్టించినప్పుడు మహిళల వారసత్వ హక్కులను నిరాకరించరాదు.. దీనిపై ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకోగలదు? అంటూ కపిల్ సిబాల్ న్యాయస్థానం ద‌ృష్టికి తీసుకెళ్లారు.

అయితే, హిందువులకు సంబంధించిన వారసత్వ విషయాల్లో కూడా ప్రభుత్వం చట్టం చేసిందని.. ముస్లిం సమాజం కోసం కూడా పార్లమెంట్ చట్టం చేసింది.. ఇందులో తప్పేముందని సిజెఐ సంజీవ్ ఖన్నా ప్రశ్నించారు. ఆర్టికల్ 26 అనేది సెక్యులర్. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందని సిజెఐ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు.

వక్ఫ్ చట్టాల అమలుపై స్టే విధించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీం కోర్టును కోరారు. ముస్లీం కమ్యూనిటీ అధికారాలను లాక్కునేందుకు కుట్ర జరుగుతుందని కపిల్ సిబల్ కోర్టులో పేర్కొన్నారు. వక్ఫ్ నూతన చట్టాలు మతస్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని కపిల్ సిబల్ వాదనలు వినిపించారు.
ఇస్లాంలో వారసత్వం వ్యక్తి మృతి తర్వాత జరుగుతుందని.. కానీ ప్రభుత్వం మృతికి ముందే వారసత్వం వస్తుందని చెబుతుందని కపిల్ సిబాల్ వాదించారు. ప్రభుత్వ ఆస్తిగా గుర్తించిన లేదా ప్రకటించిన ఆస్తిని కొత్త చట్టం అమలులోకి వచ్చిన తర్వాత వక్ప్ గా పరిగణించరాదని కొత్త చట్టంలో ఉందని కూడా కపిల్ సిబాల్ కోర్టుకు తెలిపారు. వక్ప్ బోర్డులో ముస్లిమేతర అధికారిని నియమించారని.. ఇది తనంతట తానే రాజ్యాంగ విరుద్ధమని కపిల్ సిబాల్ అన్నారు. కొత్త చట్టం అమలులోకి వస్తే ముస్లింలకు చెందిన రక్షిత స్మారకం స్థలాన్ని కూడా ఇకపై వక్ఫ్ స్థలంగా పేర్కొనలేమని కపిల్ సిబాల్ కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు.

కేసు విచారించిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హిందువుల కోసం కూడా పార్లమెంట్ చట్టాలు చేస్తుందా, హిందువుల ఆస్తులు హిందువులే నిర్వహిస్తున్నారు కదా అని సీజేఐ ప్రశ్నించారు. కలెక్టర్లకు వక్ఫ్ బోర్డు ఆస్తులపై అధికారం కల్పించడంపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు కూడా వక్ఫ్ బోర్డు భూముల్లోనే ఉందని సీజేఐ అన్నారు. చారిత్రాత్మక ఆస్తులను వక్ఫ్ గా ప్రకటించలేమని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు చెప్పారు. 2వారాల్లో కేంద్రం వక్ఫ్ చట్టంపై వివరణ ఇవ్వాలని కేంద్రానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.కాగా, కేంద్రం తరపున వాదనలు వినిపించడానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరైయ్యారు. రేపు తుషార్ త‌న వాద‌న‌ల‌ను రేపు వినిపించ‌నున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *